
సహజ సంపద దోపిడీకే ‘ఆపరేషన్ కగార్’
అనకాపల్లి టౌన్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభు త్వం అమాయక ఆదివాసి గిరిజనులను బలి తీసుకుంటుందని, ఏజెన్సీ ప్రాంతాల నుంచి గిరిజనులను తరిమి కొట్టి అక్కడ ఉండే సహజ సంపదను దోచుకోవడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. స్థానిక రోటరీ కల్యాణ మండపంలో ఆపరేషన్ కగార్ లోగుట్టు అనే అంశంపై సదస్సు సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల ఏరివేత పేరుతో నడుస్తున్న ఈ ఆపరేషన్ వెనుక అటవీ సంపదలను కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో విస్తరించిన దండకారణ్యంలో ఇనుము, సున్నపురాయి, బాకై ్సట్, డోలమైట్, సహా విలువైన ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి, అక్కడ ఉన్న ప్రజలను అడ్డుతొలగించడానికి మావోయిస్టుల అంతం పేరుతో ఆపరేషన్ కగార్ చేపట్టినట్లు ఆరోపించారు. 2005లో సల్వాజుడం, 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ చేపట్టాయని, దాని కొనసాగింపే ఆపరేషన్ కగార్ అని తెలిపారు. ఈ సమావేశంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు వి.ఎస్.కృష్ణ, ఏపీ ఆదివాసీ సంఘం గౌరవ అధ్యక్షుడు అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.