
సినిమా థియేటర్ల ఆకస్మిక తనిఖీ
నర్సీపట్నం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు నర్సీపట్నంలో సినిమా థియేటర్లను ఆర్డీవో వి.వి.రమణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా పీవీఆర్ కాంప్లెక్స్లో ఉన్న నాలుగు థియేటర్లతో పాటు రాజు, బంగార్రాజు థియేటర్లను ఆయన తహసీల్దార్ రామారావుతో కలిసి పరిశీలించారు. టాయిలెట్లు, ఫైర్ సేఫ్టీ సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధానంగా క్యాంటీన్లో ధరలను అడిగి తెలుసుకున్నారు. ధరల పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. నిబంధనల మేరకు థియేటర్లలో సౌకర్యాలు ఉన్నదీ? లేనిదీ? చూశామన్నారు. తమ పరిశీలనలో గుర్తించిన అంశాల ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆర్డీవో తెలిపారు. ఎమ్మార్పీకి మించి తినుబండారాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.