
సహజంగా మగ్గిన మామిడి పండ్లనే విక్రయించాలి
తుమ్మపాల: సహజ పద్ధతిలో మగ్గబెట్టిన మామిడి పండ్లను మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో ఉద్యాన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పండ్లను మగ్గబెట్టే సురక్షిత విధానాలపై రైతులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. హాని కలిగించే రసాయనాలతో మగ్గబెట్టే విధానాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. మామిడిని మగ్గబెట్టేందుకు కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే తీసుకునే చర్యల గురించి తెలియజేయాలన్నారు. ఆహార భద్రత శాఖ సిబ్బంది ఇప్పటి వరకు 26 శాంపిల్స్ సేకరించారని, ఆహార ప్రయోగశాల నివేదిక అందిన తర్వాత కార్బైడ్ వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్బైడ్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను జిల్లా పంచాయతీ శాఖ, మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారులకు తెలియజేయాలన్నారు. మామిడి పండ్లు రవాణా చేసే వాహనాలను రవాణా శాఖాధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ, మార్కెటింగ్, మున్సిపాలిటీ, మెడికల్, హెల్త్, పంచాయతీ, హార్టికల్చర్, ట్రాన్స్పోర్ట్ శాఖల అధికారులు పాల్గొన్నారు.