
అంధకారంలో 5 గ్రామాలు
పెదపూడి వద్ద మధ్యలో వైర్లు కలపకుండావదిలేసిన స్తంభాలు
కొత్త విద్యుత్ లైన్ వేసి పట్టించుకోని అధికారులు
లక్షలు ఖర్చుపెట్టినా అందని 24 గంటల విద్యుత్
వ్యక్తుల మధ్య విభేదాలతో పనుల నిలిపివేత
ఏడాదిన్నరగా భర్తీ కాని లైన్మన్ పోస్టు
బుచ్చెయ్యపేట: గ్రామస్థాయిలో ఒకరిద్దరి మధ్య తలెత్తిన వ్యక్తిగత విభేదాల వల్ల ఐదు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. నిరంతర విద్యుత్ వెలుగులు కోసం లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా విద్యుత్ లైన్ వేస్తే, ఒకరిద్దరు అభ్యంతరాలతో వైర్లు వేయకుండా అధికారులు వెళ్లిపోయారు. పర్యవసానంగా ఆర్నెల్లుగా ఆయా గ్రామాల ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు. బుచ్చెయ్యపేట మండలం ఎర్రవాయి శివారులో పెదపూడి, ఫంగిడి, చిన్నయ్యపాలెం, సూర్యలక్ష్మినగర్, ఉప్పరగూడం గ్రామా లకు 24 గంటలు విద్యుత్ సరఫరాకు లైన్ ఏర్పాటు చేశారు. కొత్త లైన్ వేసి ఆరు నెలలైన నేటికీ విద్యుత్ లైన్ కలపకపోగా నిరంతర కరెంట్ అందడం లేదు. సీతయ్యపేట నుంచి పెదపూడి గ్రామం వరకు ఆర్అండ్బీ రోడ్డు పక్క నుంచి విద్యుత్ స్తంభాలు వేసి వైర్లు ఏర్పాటు చేశారు.
పెదపూడి దగ్గరలో రెండు విద్యుత్ స్తంభాలను రోడ్డుకు అవతలికి మార్పు చేయాలని ఒకరిద్దరూ అడ్డుకున్నారు. రోడ్డుకు అవతల వైపు వందేళ్ల నాటి నీడనిచ్చే భారీ వృక్షాలు ఉండటంతో వాటిని నకరడం కుదరలేదు. రోడ్డుకు ఒకవైపు ఖాళీ ప్రదేశంలో స్తంభాలు వేయాలని గ్రామస్తులంతా రోడ్డు కాంట్రాక్టర్కు, విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఒకరిద్దరూ అడ్డుకున్నారన్న షాకుతో ఆరు నెలలుగా రెండు విద్యుత్ స్తంభాలు మధ్యన వైరు వేయకుండా కొత్త లైన్ కలపకుండా అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇటీవల ఏ మాత్రం గాలివాన కురిసిన గంటలు తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కొండ ప్రదేశాల్లో ఉన్న ఈ గ్రామాలకు కరెంట్ పోవడంతో చీకట్లో విష పురుగుల బెడదతో భయభ్రాంతులకు గురవుతున్నారు.
గతంలో ఇక్కడ పని చేసిన లైన్మన్ రవిని ఏడాదిన్నర క్రితం బదిలీ చేశారు. ఆ తర్వాత పీపీ అగ్రహారానికి చెందిన జేఎల్ఎంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏడాది తర్వాత జేఎల్ఎం మారిపోవడంతో ఐదు గ్రామాలకు లైన్మన్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఐదు గ్రామాల్లో ఎక్కడ ఫ్యూజ్ కాలిపోయినా పరిష్కరించే దిక్కు లేదు. పంచాయతీ నుంచి డబ్బులిచ్చి ప్రైవేటు వ్యక్తితో విద్యుత్ మరమ్మతులు చేయిస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి కొత్త లైన్ వేసినా సుమారు 800 కుటుంబాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందడం లేదని ఎర్రవాయి గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే విద్యుత్, రెవెన్యూ, పోలీస్ అధికార్లు చొరవ చూపి ఐదు గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టి, అంధకారం తొలగించాలని కోరుతున్నారు.

కొత్త విద్యుత్ లైన్ వేసి పట్టించుకోని అధికారులు