
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన
● మాజీ మంత్రి రజనిపై సీఐ దౌర్జన్యం హేయం ● వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ
అనకాపల్లి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మన రాష్ట్రంలో అమలు కావడం లేదని, రెడ్బుక్ పాలన మాత్రమే సాగుతుందని ప్రభుత్వ మాజీ విప్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. స్థానిక రింగ్రోడ్డులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ధర్మశ్రీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. మాజీ మంత్రి విడదల రజనిపై సీఐ సుబ్బారాయుడు దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అతడిని డీజీపీ, గుంటూరు ఎస్పీ తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాల మహిళలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపెట వేశారని, చంద్రబాబు పాలనలో దాడులు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీని అర్ధరాత్రి అరెస్టు చేయడమే నిదర్శనమన్నారు. అధికారులు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా కాకుండా హుందాగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. సోషల్ మీడియోలో ఐదారేళ్ల క్రితం పెట్టిన పోస్టులపై ఇప్పుడు కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అల్లూరి జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల రక్షణకు అండగా ఉండే సీఐ గుంటూరులో మాజీ మంత్రి రజనీపై అనుచితంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ మహిళలపై దాడులకు నిరసనగా త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు పెతకంశెట్టి శివసత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు మలసాల కుమార్ రాజా, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, 80, 83 వార్డుల ఇన్చార్జులు కె.ఎం.నాయుడు, జాజుల రమేష్, సీనియర్ నాయకులు బొడ్డేడ శివ, ఉగ్గిన అప్పారావు, అనకాపల్లి, కశింకోట మండలాల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద, మలసాల కిశోర్, పార్టీ నాయకురాలు నదియా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.