
టీడీపీకి కారుచౌకగా స్థలం కేటాయింపు తగదు
అనకాపల్లి: టీడీపీ కార్యాలయం ఏర్పాటుకు అతి తక్కువ అద్దెకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం తగదని సీపీఎం మండల కార్యదర్శి గంటా శ్రీరామ్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పిన అధికారులు, మండలంలో కొత్తూరు పంచాయతీ పరిధి సర్వే నంబర్ 608/10లో జిల్లా టీడీపీ కార్యాలయం నిర్మాణానికి ఎలా స్థలాన్ని కేటాయించారని ప్రశ్నించారు. సుమారు రూ.20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఏడాదికి రూ.2వేల అద్దె చొప్పున లీజుకు ఇవ్వడం అన్యాయమన్నారు. ఈ లీజును వెంట రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కనీసం రెండు, మూడు సెంట్ల నివాస స్థలం ఇవ్వడానికి చేతులు రాని ప్రభుత్వం, అధికార పార్టీకి ఏ విధంగా స్థలాలను కేటాయిస్తుందని ప్రశ్నించారు. సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏంచేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి.ఉమామహేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు కాళ్ల తేలయ్యబాబు, కనకల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.