
వరుస దొంగతనాలతో జనం బెంబేలు
అనకాపల్లి టౌన్ : పట్టణంలో మండలంలో వరుస దొంగతనాలలో ప్రజలు బెంబేలెత్తున్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న దొంగతనాలు అటు పోలీసులకు, ఇటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో ఎక్కువగా తీర్థయాత్రలకు, బందువుల ఇళ్లకు కుటుంబమంతా వెళుతుంటారు. దీనినే ఆసరాగా చేసుకొని దొంగలు తమ పని కానిచేస్తున్నారు. పగలు రెక్కి, రాత్రి చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని నగదు, బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా మండల ప్రాంతాలలో చాలా ప్రదేశాలలో సీసీ కెమెరాలు లేవు.
ఒకే రోజు మూడు దొంగతనాలు..
మూడు రోజుల క్రితం జాతీయ రహదారికి ఆనుకొని ఒకే రోజు మూడు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కొండ కొప్పాక గ్రామంలో రిటైర్డ్ డాక్యార్డ్ ఉద్యోగి కుటుంబసభ్యులతో ఉంటున్నారు. వీరి బంధువులకు బాగోలేదని ఇంటికి తాళం వేసి కూర్మన్నపాలెం వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి తులం పావు బంగారు వస్తువులు, ఐదు వేల నగదు అపహరించారు. ఈ ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంటి యజమాని కూడా హైదరాబాద్ వెళ్లడంతో ఆ ఇంట్లో కూడా దొంగలు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న రెండు కేజీల వెండి, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. జాతీయ రహదారి ఎన్జీఓ కాలనీ సాయినగర్ ఒక ఇంటి వెనక కిటికీ పగులగొట్టి ల్యాప్ట్యాప్, కారు తాళాలు, బ్యాగ్ను అపహరించారు. ఇలా ఒకే రోజు మూడు దొంగతాలు జరగడంతో జనం బెంబేలెత్తారు. పోలీసులు నిఘా పెంచి చోరీలను అరికట్టాలని కోరుతున్నారు.
వేసవి సెలవులకు వెళ్లిన వారి ఇళ్లే టార్గెట్
రాత్రి గస్తీ అంతంత మాత్రం
ఊళ్లకు వెళితే సమాచారం ఇవ్వండి
వేసవి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్ళిన వారు ఇంటిలో విలువైన వస్తువులు ఉంచరాదు. మందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే ఇంటిలో ఎల్హెచ్ఎమ్ఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) ఏర్పాటు చేస్తాం. దీనివలన యజమాని సెల్ ద్వారా ఇంటిని చూసుకొనే వీలు ఉంటుంది. అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పోలీసులు పర్యవేక్షిస్తుంటారు. ఒక వేళ అత్యవసరం మీద వెళ్లిన వారు కూడా పోలీసులకు తెలియపరిస్తే డే అండ్ నైట్ బీట్లను ఏర్పాటు చేస్తాం.
– అల్లు వెంకటేశ్వరావు, పట్టణ ఎస్ఐ, క్రైం

వరుస దొంగతనాలతో జనం బెంబేలు