
ఈసారీ కందిపప్పు లేనట్టే!
అనకాపల్లి టౌన్: జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఈ నెలలో కూడా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేయనున్నారు. కందిపప్పును మాత్రం అడగొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కొద్ది నెలలుగా కందిపప్పు పంపిణీ చేస్తారని ఆశతో ఎదురు చూసినా కార్డుదారులకు ఈ నెల కూడా నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా 5.37 లక్షల రేషన్ కార్డుదారులకు 14.99 లక్షల మంది యూనిట్ దారులు ఉన్నారు. వీరందరూ కందిపప్పు కోసం బహిరంగ మార్కెట్ను ఆశ్రయించాల్సిదే. కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత బియ్యంతో పాటు జొన్నలు, రాగులు, పంచదార వంటి నిత్యావసర వస్తువులన్నీ ఇస్తామని ఊదరగొట్టింది. దీంతో లబ్ధిదారులందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తుండడంతో కార్డుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డిపోల ద్వారా కేజీ కందిపప్పును 67 రూపాయలకు అందజేసేవారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్పై ఊదరగొట్టారు. ప్రయోగాత్మకంగా పట్టణ ప్రాంతాలలో కేజీ 50 రూపాయలకే కందిపప్పు అందజేస్తామని ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.120 పలుకుతుంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రేషన్ ద్వారా కార్డుదారులకు కందిపప్పును పంపిణీ చేయకపోవడం వల్ల 14.99 లక్షల మందికి 120 రూపాయలు చొప్పున లెక్కిస్తే 17,98,80,000 చేతి చమురు వదులుతుందన్నమాట.
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పప్పన్నం దూరం