ఆరేళ్ల మేనకోడలిని హతమార్చిన కిరాతకుడికి ఉరే సరి | - | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల మేనకోడలిని హతమార్చిన కిరాతకుడికి ఉరే సరి

Apr 2 2025 2:10 AM | Updated on Apr 2 2025 2:24 AM

ఆరేళ్

ఆరేళ్ల మేనకోడలిని హతమార్చిన కిరాతకుడికి ఉరే సరి

పదేళ్ల క్రితం ఆ దుర్ఘటన ఓ సంచలనం.. అందరి హృదయాలను కలచివేసిన విషాదం.. మళ్లీ ఇప్పుడు ఆ కేసులో కోర్టు తీర్పు మరో సంచలనం.. ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన కిరాతకుడికి ఉరి శిక్ష విధించడంతో సర్వత్రా ఆమోదం..
● కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం ● న్యాయం జరిగిందన్న తల్లిదండ్రులు

దేవరాపల్లి: వరుసకు మేనమామ.. 20 రూపాయలిచ్చి గారెలు కొనుక్కోమన్నాడు.. అవంటే తనకెంతో ఇష్టం.. స్కూలు నుంచి బండిపై తీసుకెళ్లాడు.. హాయిగా తింటూ కబుర్లు చెప్పవచ్చని ఆశించిన ఆరేళ్ల చిన్నారి కొద్ది క్షణాల్లోనే విగత జీవిగా మారింది. అక్కా బావలపై కక్షతో సీసా పెంకులతో బాలికను కిరాతకంగా హతమార్చాడు. వినడానికి, చదవడానికి ఎంతో వేదన కలిగించే ఈ దుర్ఘటనలో ఆ బాలిక ఎంత హింస అనుభవించిందో.. ప్రాణం పోయేవరకు ఎంత గిజగిజలాడిందో.. ఆమెను విగత జీవిగా చూసి తల్లిదండ్రుల హృదయం ఎన్ని ముక్కలయ్యిందో..

పోలీసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ వాదన ఆ దురాగతాన్ని కళ్లకు కట్టాయి. ఫలితంగా చోడవరంలోని 9వ జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు అతి పెద్ద శిక్ష విధించింది. అరుదైన కేసుల్లో మాత్రమే విధించే ఉరి శిక్షను అమలు చేయమని కోరుతూ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.రత్నకుమారి మంగళవారం తీర్పు చెప్పారు.

పెద్దమ్మ కుమారుడని చేరదీస్తే..

రైవాడ జలాశయం నిర్మాణ సమయంలో బాలిక తాత శ్రీరామ వెంకటేశ్వర్లు కుటుంబం క్వారీ పని కోసం తమిళనాడు నుంచి దేవరాపల్లి వలస వచ్చారు. వెంకటేశ్వర్లు కుమార్తె ధనలక్ష్మికి వేపాడ మురుగన్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి కుమార్తె దివ్యతోపాటు కుమారుడు ఉన్నాడు. ధనలక్ష్మి పెద్దమ్మ కుమారుడైన సుబ్బాచారి గుణశేఖర్‌ లారీ క్లీనర్‌గా పనిచేస్తూ దేవరాపల్లి ఉండేవాడు. ఖాళీ సమయాల్లో ధనలక్ష్మి ఇంటి వద్ద నడిపే టిఫిన్‌ దుకాణంలో సాయం చేస్తూ అక్కడే ఉండేవాడు. వ్యసనాలకు బానిసైన సుబ్బాచారి గుణశేఖర్‌ ప్రవర్తన నచ్చకపోవడంతో అతడిని తన ఇంటికి రావొద్దంటూ ధనలక్ష్మి చెప్పింది. దీంతో ఆమైపె కక్ష పెంచుకున్న అతడు ధనలక్ష్మితో పాటు కుమార్తె దివ్యను హతమార్చాలని పథకం రచించుకున్నాడు. దివ్యను 2015 డిసెంబర్‌ 23 సాయంత్రం పాఠశాల నుంచి బయటకు తీసుకువచ్చి రూ.20 చేతికిచ్చి గారెలు కొని తెచ్చుకుందామని నమ్మ బలికి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని బిల్లల మెట్టపై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న బీరు సీసాను పగలకొట్టి గాజు పెంకుతో బాలిక పీక కోసి అతి కిరాతకంగా హతమార్చాడు. కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోగా బాలికను నిందితుడు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని బిల్లల మెట్ట వైపు వెళ్లడాన్ని చూసినట్లు స్థానికులు చెప్పారు. బాలిక మృతదేహం బిల్లల మెట్టపై పొదల్లో లభించడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. అప్పటి ఎస్‌ఐ జి.ఎన్‌.అప్పన్న (ప్రస్తుతం పాయకరావుపేట సీఐ) కేసు నమోదు చేయగా, సీఐ కిరణ్‌కుమార్‌ (ప్రస్తుతం విజయవాడ డీఎస్పీ) దర్యాప్తు చేశారు. చోడవరంలోని 9వ జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. గత ఏడాది నవంబర్‌లో తుది విచారణ ప్రారంభించిన కోర్టు 20 మంది సాక్షుల్ని విచారించింది. బాలికను సుబ్చాచారి గుణశేఖర్‌ హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ముద్దాయికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మంగళవారం సంచలన తీర్చునిచ్చారు. తీర్పు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

నరరూప రాక్షసులకు దడ పుట్టించే తీర్పు

మా కుమార్తెను అతి దారుణంగా హత్య చేసిన నరరూప రాక్షసుడికి కోర్టు ఉరి శిక్ష విధించడం మాకెంతో ఆనందం కలిగించింది. మా కుమార్తెలా మరెవ్వరికీ అన్యాయం జరగకుండా కోర్టు తీర్పు దోహదపడుతుంది. ముద్దాయికి ఉరి శిక్ష విధించడంతో మా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుంది. తీర్చు ఇచ్చిన గౌరవ న్యాయమూర్తికి జీవింతాంతం రుణపడి ఉంటాం.

–వేపాడ మురుగన్‌, ధనలక్ష్మి

ఆరేళ్ల మేనకోడలిని హతమార్చిన కిరాతకుడికి ఉరే సరి 1
1/1

ఆరేళ్ల మేనకోడలిని హతమార్చిన కిరాతకుడికి ఉరే సరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement