నర్సీపట్నం : ఏటీఎం కార్డుల చోరీ నిందితుడుని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న నర్సీపట్నం మున్సిపాలిటీ కృష్ణాబజార్ ఏటీఎం వద్ద షేక్ రుక్సానా డబ్బులు డ్రా చేస్తుండగా, ఆమెను మాటల్లో దించి తన ఒరిజినల్ ఏటీఎం కార్డు కాజేసి, ఆమెకు నకిలీ కార్డు ఇచ్చాడు. ఆమె ఖాతా నుంచి రూ.30 వేలు నగదు డ్రా చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఏటీఎం కార్డుల చోరీ నిందితుడిని పట్టుకునేందుకు సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.ఎస్. రామకృష్ణ, గొలుగొండ హెడ్ కానిస్టేబుల్ ఎం.రాజు, కానిస్టేబుల్ నానితో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం ఐదు రోజులు శ్రమించి నిందితుడు రాజమండ్రి వద్ద ధవళేశ్వరానికి చెందిన ఇల్ల వెంకటసాయి కిరణ్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అతడి వద్ద నుంచి 30 ఏటీఎం కార్డులు, రూ.28 వేలు నగదు రికవరీ చేశామన్నారు. నిందితుడిపై రాజానగరం పోలీసుస్టేషన్లో హత్య కేసు 2016లో నమోదైందన్నారు. 2019 నుంచి నిందితుడిపై రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాలు, ఈస్ట్ గోదావరి, అనకాపల్లి, హైదరాబాద్ ప్రాంతాల్లో 14 వరకు చోరీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుడు జల్సాలకు అలవాటు పడి ఏటీఎం కార్డుల దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. నిందితుడుని పట్టుకున్న బృందాన్ని అభినందించారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ చైతన్య, టౌన్ సీఐ గోవిందరావు, ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు.