● జిల్లాలో పలుచోట్ల గాలి వాన ● నేలరాలిన మామిడి పంట ● అనకాపల్లిలో అత్యధికంగా 16.75 మి.మీ వర్షపాతం
సాక్షి, అనకాపల్లి, చోడవరం, మునగపాక, అనకాపల్లి టౌన్: మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న జిల్లా ప్రజలకు వర్షం ఊరట కలిగించింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ 37 డిగ్రీల సెల్సియస్తో ఎండ మండిపోగా.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలుతో వాతావరణమంతా చల్లబడిపోవడంతో జనం కాస్త సేదదీరారు. సుమారు గంట వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇదిలావుండగా ఈదురుగాలులు, భారీ వర్షానికి మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. అసలే ఈ ఏడాది తేనెమంచు కారణంగా 30 శాతం కూడా మామిడి పంట పండలేదు. పండిన పంట ప్రస్తుతం కాయ దిగుబడి దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి పంటకు తీవ్రనష్టం కలిగింది. ఈదురుగాలులకు పక్వానికి వచ్చిన మామిడి కాయ నేలరాలింది. దీంతో మామిడి రైతులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు.
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
మునగపాక మండలంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూలపేటలో నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. స్పందించిన ఏఈ గోపీకృష్ణ గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి మంగళవారం విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈదురుగాలుల హడావుడి
అనకాపల్లి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో గ్రామాల నుంచి పట్టణానికి వివిధ పనులపై వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంటపాటు ఏకధాటిన వర్షం కురిసి విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు చేరడంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
జిల్లాలో వర్షపాతం
మండలం వర్షపాతం (మి.మీ.లలో)
అనకాపల్లి 6.75
నర్సీపట్నం 14.00
రోలుగుంట 9.75
సబ్బవరం 8.75
కె.కోటపాడు 8.5
చీడికాడ 4.75
పరవాడ 3.00
మాడుగుల 2.75
రావికమతం 1.75
బుచ్చెయ్యపేట 1.50
మాడుగుల 1.00
గొలుగొండ 0.50
మండే ఎండల్లో కాసింత ఊరట
మండే ఎండల్లో కాసింత ఊరట