
వరి గడ్డి
భగ్గుమన్న
● పశుగ్రాసం కొరతతో పాడి రైతులు సతమతం ● మూడింతలు పెరిగి ఆకాశాన్నంటిన గడ్డి ధరలు
● పెట్టుబడి సాయం అందకపోవడంతో తగ్గిన వరి సాగు ● కోత యంత్రాల వినియోగంతో వృథా అవుతున్న గడ్డి ● పొరుగు జిల్లాల నుంచి కొనుగోలు చేయాల్సిన దుస్థితి
సాక్షి, అనకాపల్లి: పశువులకు మేతగా వాడే వరి గడ్డికి డిమాండ్ ఏర్పడింది. వరి పంట నూర్పుల సమయంలో గడ్డిని కుప్పలుగా వేసి భద్రపర్చుకుని, పాడి రైతులు వేసవిలో పశువులకు మేతగా వినియోగించుకుంటారు. ఈ ఏడాది కొరత ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. రైతుకు పెట్టుబడుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందకపోవడంతో వరి సాగు తగ్గుముఖం పట్టింది. దీనికి తోడుగా వరి కోత యంత్రాల వినియోగం పెరగడంతో గడ్డి గణనీయంగా తగ్గింది. దీంతో పొరుగునున్న కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వరిగడ్డి కొనుగోలు చేసి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ బోర్ల సదుపాయం ఉన్న పాడి రైతులు ప్రత్యామ్నాయంగా పచ్చగడ్డి పశుగ్రాసంగా వేస్తారు. వేసవిలో పచ్చగడ్డితోపాటు ఎండు వరి గడ్డి సమపాళ్లలో పశువులకు మేతగా వేస్తారు. కానీ ప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను 9 గంటలకు బదులు 3 లేదా 4 గంటల పాటే ఇవ్వడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వరి గడ్డి కొరత తీర్చేందుకు పచ్చగడ్డి అందించలేని పరిస్థితి నెలకొంది.
ఎకరా గడ్డికి మూడింతల ధర
జిల్లాలో 2.34 లక్షల కుటుంబాలు పశుపోషణ చేస్తున్నాయి. 1.85 లక్షల ఆవులు, 2.5 లక్షల గేదెల పశుసంపద ఉంది. వీటికి ఏడాదికి సగటున 5 నుంచి 6 లక్షల టన్నుల వరకు వరి గడ్డి అవసరం ఉంటుందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఎకరా గడ్డి రూ.5 వేలకు కొనగా.. ఇప్పుడు రూ.13 వేల నుంచి రూ.16 వేలు పలుకుతోంది. మున్ముందు గ్రాసం ధర మరింత పెరిగే అవకాశం ఉండటంతో పశుపోషణపై ఆధారపడిన పలు కు టుంబాల వారు ముందస్తుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడకు తెచ్చుకుంటున్నారు.
గణనీయంగా తగ్గిన వరి గడ్డి
జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1.32 లక్షల ఎకరాల్లో, రబీలో 39,564 ఎకరాల్లో వరి సాగు చేశారు. సాధారణంగా ఎకరా వరి పంట కోత కోస్తే ఐదారు టన్నుల గడ్డి వస్తుంది. కోత యంత్రాలు వినియోగిస్తే మూడు టన్నుల గడ్డి కూడా రావడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సగం భూముల్లో వరి కోత యంత్రాల ద్వారా కోతలు జరిగాయి. రెండుసార్లు భారీ వర్షాలు పడి పంట మునిగిపోయింది. దీంతో డిసెంబర్ నెలలో పంట పూర్తయినా కుప్పలుగా వేసి సంక్రాంతి తరువాత నుంచి నూర్పులు చేశారు. వేసవిలో వరి గడ్డి లేకపోవడంతో ప్రతిరో జూ ట్రాక్టర్లలో గడ్డి పొరుగు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. కొందరు రైతులు నూర్పిడి ఖర్చులు పెట్టుకొని గడ్డిని తీసుకెళ్లాలని షరతు పెడుతున్నారు. ఎకరా పంట నూర్పిడికి రూ.11 వేలు ఖర్చవుతుండగా ఆ మొత్తాన్ని భరించేందుకు కూడా కొందరు ముందుకు వస్తున్నారు.
వరి నూర్పు పనుల్లో నిమగ్నమైన రైతులు
ఎకరా గడ్డి ఇంటికి చేరేందుకు రూ.16 వేల ఖర్చు
ఆక్సాహేబుపేట గ్రామంలో సగం పల్లం.. సగం మెట్ట భూములున్నాయి. తాండవ రిజర్వాయర్ ద్వారా కొంతమేర వరి పంట పండిస్తారు. మెట్ట ప్రాంతాల్లో జీడి మామిడి సాగు చేస్తాం. ఈ ఏడాది తాండవ రిజర్వాయర్ నుంచి నీరు ఎక్కువగా రాకపోవడంతో వరి సాగు తగ్గింది. దీంతో గడ్డి కొరత ఏర్పడింది. కాకినాడ జిల్లా చేబ్రోలులో వరి గడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్లో తెచ్చుకుంటున్నాం. ఎకరా వరి పంట నూర్పుకు అయ్యే ఖర్చు అక్కడ రైతుకు ఇస్తే మనకు ఎండు వరి గడ్డి ఇస్తారు. సుమారు 50 కి.మీ. దూరం నుంచి తీసుకొని వస్తున్నాం. ఎకరా గడ్డి మా గ్రామానికి తీసుకొచ్చేందుకు రూ.16 వేలు అవుతోంది.
– అల్లు చిట్టిబాబు, రైతు, ఆక్సాహేబుపేట గ్రామం, కోటవురట్ల మండలం

వరి గడ్డి