మద్దిలపాలెం: గుజరాత్లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీలో ‘అప్లైడ్ సైకాలజీ ప్రస్తుత సవాళ్లు – భవిష్యత్తు అవకాశాల దార్శనికత’ అనే ఇతివృత్తంతో జరిగిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ 61వ జాతీయ, 30వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు పలు అవార్డులు సాధించారు. ప్రొఫెసర్ ప్రమోద్కుమార్ యంగ్ సైకాలజిస్ట్ అవార్డును ఏయూ ఎం.ఎస్సీ సైకాలజీ విద్యార్థినులు జె.మనీషా, ముడిదన కారుణ్య అందుకున్నారు. ‘యూనివర్సిటీ విద్యార్థుల్లో నిద్ర నాణ్యత, విద్యాపరమైన జాప్యంపై డిజిటల్ వ్యసనం ప్రభావం’ అనే అంశంపై వారు చేసిన పరిశోధనకు ఈ గుర్తింపు లభించింది. నైనా సింగ్ మెమోరియల్ అవార్డును ఏయూ ఎం.ఎస్సీ విద్యార్థిని గౌరీలక్ష్మి కొరిబిల్లి పొందారు. ‘యువతలో ప్రకృతితో అనుబంధం, అది వారి భావోద్వేగ నియంత్రణపై చూపే ప్రభావం’ అనే అంశంపై చేసిన అధ్యయనానికి ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన విద్యార్థులను ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ శనివారం తన కార్యాలయంలో అభినందించారు. ఏయూ సైకాలజీ విభాగాధిపతి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్యఎం.వి.ఆర్.రాజు పాల్గొన్నారు.


