తాటిచెట్లపాలెం: సాలగ్రామపురంలో దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మాల్గా పేరుగాంచిన ‘ఇనార్బిట్ మాల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోప్లాని, ప్రాజెక్ట్స్ అండ్ డిజైన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ సయ్యద్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ హిమాంశు ధడుధాలు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు షేక్ కౌసర్ సాహిల్, యాళ్ల సత్తిబాబు, గాలిదేవర శివగంగ దుర్గా, అడ్డగుదురు ప్రణయ్ల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం విశేషం. మాల్ ప్రారంభం సందర్భంగా మొదటి 500 మందికి ‘గోల్డెన్ టికెట్’ గిఫ్ట్లు ప్రకటించడంతో ఉదయం నుంచే నగరవాసులు భారీగా తరలివచ్చారు. జనం ఒక్కసారిగా లోపలికి రావడంతో స్వల్ప తోపులాట జరగగా, ఫోర్త్ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలు అవుట్లెట్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నగరంలోని అతిపెద్ద మాల్ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బారులు తీరారు.


