డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టు గ్రామంలో మంగళవారం స్థానిక పోలీసులు డ్రోన్ కెమెరాతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి గృహాన్ని తనిఖీ చేసి, స్థానిక కుటుంబాలతో మాట్లాడారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితుల వివరాలను పోలీసులు సేకరించారు.గంజాయి వంటి మత్తు పదార్థాల సాగు, రవాణా వంటి నేరాలకు ఎవరూ పాల్పడకూడదని, అటువంటి వారికి సహకరించవద్దని పోలీసులు హెచ్చరించారు. పాత నేరస్తులు మళ్లీ పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.2018లో లివిటిపుట్టు సమీపంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో, ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లివిటిపుట్టులో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తున్న పోలీసులు
డ్రోన్ నిఘాలో లివిటిపుట్టు గ్రామం
గ్రామాన్ని చుట్టముట్టిన పోలీసులు


