పాడేరు : ఎండ వేడి, ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పట్టణవాసులకు మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి కురిసిన భారీ వర్షంతో సేదతీరారు. పాడేరు పరిసర ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా విభిన్న వాతావరణం చోటుచేసుకుంటోంది. ఉదయం పూట దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఉదయం 9గంటల తరువాత ఎండ ప్రభావం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం పూట ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా మొదలైన వర్షం సుమారు గంటపాటు దంచికొట్టింది. పాడేరు పరసర ప్రాంతాల్లో ఒకే రోజు మూడు విభిన్న వాతావరణాన్ని స్థానికులు ఆస్వాదిస్తున్నారు.
సీలేరులో ఉరుములు, మెరుపులతో..
సీలేరు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఒడిశా, పోలవరం సరిహద్దుల్లో వాతావరణం ప్రతిరోజూ విభిన్నంగా మారుతోంది. గత వారం రోజులుగా ఏదో ఒక సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సుమారు గంటపాటు కురవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


