● మానవ హక్కుల సంఘం నేత
సూర్యనారాయణ
● పాడేరు జిల్లా ఆస్పత్రి సందర్శన
సాక్షి, పాడేరు: వాతావరణ మార్పులు, అధిక వర్షాలతో గిరిజనులు విష జ్వరాలు బారిన పడుతున్నారని, అన్ని గ్రామాల్లోనూ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సల్లంగి సూర్యనారాయణ కోరారు. పాడేరు జిల్లా ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న హుకుంపేట మండలం గనిక గ్రామానికి చెందిన బాలన్నతో పాటు పలువురు రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు విజృంభించక ముందే ప్రభుత్వం ఏజెన్సీలో వైద్య బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య బృందాలు ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటింటికి వెళ్లి గిరిజనులకు సత్వరమే మెరుగైన వైద్యసేవలు అందించారని గుర్తు చేశారు. స్పెషలిస్టు వైద్యులు కూడా గ్రామాల్లో తిరగడంతో గిరిజనులకు ఎంతో మేలు జరిగిందన్నారు. అదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేయాలన్నారు. గత రెండేళ్లుగా గిరిజనులకు దోమ తెరలు పంపిణీ చేయకపోవడంతో మలేరియా కేసులు అధికమయ్యాయని చెప్పారు. గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీతో పాటు దోమతెరలను వెంటనే పంపిణీ చేయాలని ఆయన కోరారు. జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలతో పాటు కేజీహెచ్కు అంబులె న్స్ సౌకర్యం నిత్యం అందుబాటులో ఉంచాలన్నారు.


