రావికమతం: మండలంలో దొండపూడి చెక్పోస్టు వద్ద శనివారం 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు బ్యాగుల్లో గంజాయిని తరిలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దొండపూడి చెక్పోస్టు వద్ద శనివారం వాహనాలను తనిఖీ చేసినట్టు చెప్పారు. ఈ సమయంలో ఇద్దరు నిందితులు రెండు బ్యాగులు వదిలి పారిపోతుండగా సిబ్బందితో వారిని వెంబడించినట్టు ఎస్ఐ తెలిపారు. ఒక్క వ్యక్తిని పట్టుకున్నామని, మరో నిందితుడు పరారయ్యాడని చెప్పారు. రెండు లగేజీ బ్యాగ్ల్లో తనిఖీ చేసి 22 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి నుంచి రెండు జతల బంగారం ఆభరణాలు,రూ. 1000 నగదు,రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడు నెల్లూరు జిల్లా నాయుడు పేటకు చెందిన వ్యక్తి అని, ఇప్పటికే అల్లూరి జిల్లా సీలేరు,నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసు స్టేషన్లలో గంజాయి కేసులు,రోలుగుంట పోలీస్ స్టేషన్లో బంగారం చోరీ కేసు ఉన్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చోడవరం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ తరలించామని, పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ చెప్పారు.


