సీలేరు: గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధిలోని చట్టాపల్లి గ్రామంలో 2024, డిసెంబర్ 8న సంభవించిన పెను తుఫాను సృష్టించిన బీభత్సం మనందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో గ్రామం భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూసింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం స్పందించి గ్రామంలో 36 ఇళ్లతో కూడిన ‘మోడల్ కాలనీ’ నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ప్రమాదం జరిగి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఇళ్ల స్థలాల కేటాయింపు కానీ, కాలనీ నిర్మాణ పనులు కానీ ప్రారంభం కాలేదని శుక్రవారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సొంత నిధులతో ఇల్లు నిర్మించుకుందామన్నా ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మోడల్ కాలనీ వెంటనే నిర్మించాలి, లేనిపక్షంలో ‘ప్రధానమంత్రి జన్–మన్’ పథకం కింద ఇళ్లను మంజూరు చేయాలని కోరుతున్నారు. తుఫానులో ప్రాణాలు కోల్పోయిన కొర్ర కుమారి కుటుంబానికి, అలాగే కాళ్లు చేతులు కోల్పోయిన కొర్ర రామన్న కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఇళ్లు నిర్మించి ఆదుకోవాలని ఎంపీటీసీ నిర్మల రాజేశ్వరి డిమాండ్ చేశారు. బాధితుల పట్ల ప్రభుత్వ ఉదాసీనత తగదని, తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.
రెండేళ్లు గడిచినా పూర్తికాని
మోడల్ కాలనీ హామీ


