● గణాంక శాస్త్రంలో శెట్టి శ్రీను
పరిశోధన
డుంబ్రిగుడ: మండల కేంద్రానికి చెందిన శెట్టి శ్రీను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. స్టాటిస్టిక్స్ (గణాంక శాస్త్రం) విభాగంలో ప్రొఫెసర్ బి. మునిస్వామి మార్గదర్శకత్వంలో ‘ఫెర్టిలిటీ ప్యాటర్న్’ అంశంపై ఆయన చేసిన పరిశోధనకు ఏయూ ఈ పీహెచ్డీని ప్రదానం చేసింది. శ్రీను తన పరిశోధనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాల తీరును విశ్లేషించారు. ప్రస్తుతం సిజేరియన్ ప్రసవాలు 21 శాతం పెరిగాయని, ఇదే ధోరణి కొనసాగితే 2030 నాటికి ఇవి 29 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తన పరిశోధనా వ్యాసంలో వెల్లడించారు.
కృషి ఉంటే.. విజయం సాధ్యం..
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన శ్రీను, అనేక ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అరకులోయలోని సెయింట్ జోసెప్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన, విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి, నేడు డాక్టరేట్ సాధించారు. అత్యున్నత పట్టా పొందిన శ్రీనును మండల కేంద్రంలోని గ్రామస్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘనంగా అభినందించారు.


