అనకాపల్లి: భావితరాలను దృష్టిలో పెట్టుకుని పిచ్చుకలను రక్షించుకునేందుకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని వృక్షమిత్ర, ఏపీ జీవైవిధ్య సంరక్షణ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కణతాల ఫణిభూషన్ శ్రీధర్ అన్నారు. స్థానిక జీవీఎంసీ విలీనగ్రామైన ఎరుకువానిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చుకతో మనిషికి ఉన్న సంబంధం కొన్ని వేల సంవత్సరాల నాటిదని చెప్పారు. ప్రస్తుతం అంతరించిపోతున్న జీవజాతుల్లో పిచ్చుకలు చేరిపోతున్నాయన్నారు. సెల్ టవర్ల రేడియో ధార్మికత పిచ్చుకలకు ప్రాణసంకటంగా మారిందని, ఈ చిన్నారి పిచ్చుక జాతిని కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో దానికో గూడు కట్టి, గింజలు, తాగునీరు పెట్టాలని సూచించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో ధాన్యపు కుంచులను, తాగునీటి కోసం మట్టి పాత్రలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె.ఎన్.మూర్తి, బి.వై.వి.ఎస్.కృష్ణారావు, ఈ.శ్రీలత, ఎ.ఉమా, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అరిగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


