దేవరాపల్లి: మండలంంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి దేవరాపల్లిలోని మహేశ్వరి థియేటర్ సమీపంలో విద్యుత్ తీగలపై చెట్టు విరిగిపడింది. దీంతో విద్యుత్ సరఫరాకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఈదురు గాలుల ధాటికి దెబ్బతింది. స్థానిక ఎలక్ట్రికల్ ఏఈఈ కె. శంకరరావు ఆదేశాలతో లైన్మన్ బి. రాము సిబ్బంది సహకారంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో మోస్తరు వర్షం కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు.
నేలకొరిగిన చెట్లు
మాడుగుల రూరల్: ఆకాశంలో ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకుని ఈదురుగాలులతో కూడిన వర్షం గురువారం సాయంత్రం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత, ఎండ తీవ్రతకు విలవిలలాడిన ప్రజలు ఉపశమనం పొందారు. ఈ వర్షం వల్ల కోసిన మినప పంట తడిసి ముద్దయిందని రైతులు వాపోయారు. ఈదురు గాలులతో చిన్న వృక్షాలు నేలకొరిగాయి.


