పల్స్పోలియోను విజయవంతం చేయండి
● కలెక్టర్ దినేష్కుమార్ పిలుపు
● 1,29,959 మంది చిన్నారులకు
చుక్కలమందు లక్ష్యం
● 1.82లక్షల డోస్లు సిద్ధం
పాడేరు : జిల్లాలో ఆదివారం జరిగే పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఐటీడీఏ ఎదుట ఆయనతోపాటు అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ రవిబాబు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 0 వయసు నుంచి ఐదేళ్ల వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. ఆదివారం చుక్కల మందు వేయించలేని పిల్లలకు ఈనెనెల 22,23 తేదీల్లో ఇంటింటికి సర్వే చేపట్టి శతశాతం పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 64పీహెచ్సీల పరిధిలో 1,29,959 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీరికోసం 1.82లక్షల డోస్లు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లావ్యాప్తంగా 2506 కేంద్రాలు 10,024 మంది వ్యాక్సినేటర్లు, 233 మంది పర్యవేక్షకులను నియమించామన్నారు. 37ట్రాన్సిట్ పాయింట్లు, 74 సంచార బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. అనంతరం పల్స్ పోలీయో గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ కృస్ణమూర్తి నాయక్, ఎంపీపీ రత్నాలమ్మ, ఏడీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్, వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పూర్తి
డుంబ్రిగుడ: జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక పీహెచ్సీని సందర్శించారు. ఆదివారం చేపట్టనున్న పల్స్పోలియో కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి గ్రామంలో బస్టాప్, పర్యాటక ప్రదేశాల్లో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి 0–5 సంవత్సరాల వయసు గల చిన్నారులందరికి పోలియో చూక్కలు వేయించాలని సిబ్బందికి సూచించారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇంటింటికి సర్వే నిర్వహించి నూరుశాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యాధికారులు రాంబాబు, అంబికా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చింతూరు: పల్స్పోలియో కార్యక్రమానికి సంబంధించి డివిజన్ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పల్స్ పోలియోకు సంబధించిన బ్యానర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ డివిజన్లోని నాలుగు మండలాల్లో 0 నుంచి 5 ఏళ్లలోపు 10,710 మంది చిన్నారులు ఉన్నారన్నారు. తొలిరోజు వీరికి పోలియో చుక్కలు వేసేందుకు 387 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో చుక్కలు వేసేందుకు 1,548 మంది వ్యాక్సినేటర్లను, వారిని పర్యవేక్షించేందుకు 40 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. కొండలపై ఉంటున్న కొండరెడ్డి కుటుంబాలు, వలస ఆదివాసీ గ్రామాల పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు గాను డివిజన్లో 43 కేంద్రాలను మైగ్రేటరీ, హైరిస్క్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర శాఖల అధికారులు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని, ఆయా కేంద్రాల్లో ప్రారంభానికి ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రామతులసి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్య, తహసీల్దార్ సయ్యద్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాసదొర, సీడీపీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
రంపచోడవరం: ఏజెన్సీలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలో పోలియో చుక్కల ర్యాలీని ఎస్టీ కమిషన్ మెంబరు గొర్లె సునీత, పీవో స్మరణ్రాజ్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బొజ్జిరెడ్డి మాట్లాడుతూ ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పోలియో రహిత దేశంగా, రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందన్నారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీ ఏడు మండలాల్లో 18,164 మంది ఐదు సంవత్సరాల లోపు పిల్లులున్నారని, ఇందుకోసం పోలియో చుక్కల డోసుల సిద్ధం చేశామన్నారు. అంబేడ్కర్ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఏడీఎంహెచ్ఓ సరిత, డీడీ రుక్మాండయ్య, ఎంపీడీవో స్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పల్స్పోలియోను విజయవంతం చేయండి
పల్స్పోలియోను విజయవంతం చేయండి


