వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● డుంబ్రిగుడలో 3.8 డిగ్రీల నమోదు
● ఉదయం 11 వరకు వీడని మంచుతెరలు
● ఇబ్బందులు పడుతున్న అన్నివర్గాల ప్రజలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం డుంబ్రిగుడలో 3.8 డిగ్రీలు, జి మాడుగులలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి హుకుంపేటలో 6.2 డిగ్రీలు, ముంచంగిపుట్టు, పాడేరులో 6.9 డిగ్రీలు, పెదబయలులో 7.1 డిగ్రీలు, చింతపల్లిలో 7.5 డిగ్రీలు, కొయ్యూరులో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు.
● రంపచోడవరం డివిజన్న్ వై.రామవరంలో 9.1 డిగ్రీలు, మారేడులిల్లిలో 10.5 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.2 డిగ్రీలు, రంపచోడవరంలో 13.7 డిగ్రీలు, గంగవరంలో 14.9 డిగ్రీలు, చింతూరు డివిజన్ ఎటపాకలో 14.3 డిగ్రీలు, చింతూరులో 14.9 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు.
● గత నాలుగు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో చిన్నారులు, వృద్ధులు, చిరు వ్యాపారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులు ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు వేసుకుని సాయంత్రం, ఉదయం వేళల్లో ఉపశమనం పొందుతున్నారు. ఉదయం 9 గంటలు దాటే వరకూ పొగమంచు తెరలు వీడటం లేదు. దీంతో విద్యార్థులు, వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు. రహదారులను మంచు తెరలు కమ్మేయడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు.
డుంబ్రిగుడ: మండలంలో చలితీవ్రత పెరిగింది. గురువారం ఈ ప్రాంతంలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మంచు ఉదయం 11 గంటల వరకు కురుస్తోంది. సాయంత్రం నుంచి ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత నెలకొంటోంది.
వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు


