బిర్సాముండా స్ఫూర్తితో ‘హైడ్రో పవర్’ వ్యతిరేక ఉద్యమం
పాడేరు : ఏజెన్సీలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టులపై ఆదివాసీల పోరాట యోధుడు భగవాన్ బిర్సాముండా స్ఫూర్తితో వ్యతిరేక ఉద్యమం చేపడుతామని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం, జిల్లా కార్యదర్శి అప్పలనర్స తెలిపారు. శనివారం పట్టణంలోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో సీపీఎం పార్టీ బిర్సాముండా జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమామలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ గతంలో ఆదివాసీ మహిళలను కించపర్చిన ఒడిశా సీఎం పాడేరు వచ్చి బిర్సాముండా లాంటి మహానీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక హక్కు లేదన్నారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో సరిహద్దుల సమస్య గత పదేళ్లుగా కొనసాగుతుందన్నారు. దీనిపై పాడేరు వస్తున్న ఒడిశా సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో దాదాపుగా 500 వెనుకబడిన తెగలు ఉన్నాయన్నారు. వీరికి భూమి, నీరు, అడవి హక్కులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న ఉద్దేశంతోనే జల్, జంగిల్, జమీన్ నినాదంతో బిర్సాముండా పోరాటాలు చేశారన్నారు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పొరాటాల ఫలితంగానే ఐదో షెడ్యూల్ అమల్లోకి వచ్చిందన్నారు. బిర్సాముండా పోరాటాల స్ఫూర్తితో తమ పార్టీ ఉద్యమాలు కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమా మహేశ్వరరావు, అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు, జిల్లా కమిటీ సభ్యులు పోతురాజు, విజయ, చిట్టిబాబు, రామారావు, సుందర్రావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొద్దు బాల్దేవ్, ధర్మన్న పడాల్ పాల్గొన్నారు.
చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలి
చింతూరు: ఐదవ షెడ్యూల్ భూ భాగంలో ఆదివాసీ చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ చేశారు. బిర్సాముండా జయంతి సందర్భంగా చింతూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల పోరాటయోధుడైన బిర్సాముండా నేటి యువతరానికి ఆదర్శప్రాయుడన్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన 1/59, 1/70 చట్టాలున్నా ప్రభుత్వాలు ఎలాంటి న్యాయం చేయడంలేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివాసీ చట్టాలు, హక్కుల కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. వలస గిరిజనేతరుల వల్ల స్థానిక ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతోందని, వారిని వెంటనే మైదాన ప్రాంతాలకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాక అరుణకుమారి, జేఏసీ నాయకులు కారం సాయిబాబు, మడివి రాజు, కాక సీతారామయ్య, పూనెం శ్రీను, అశోక్ పాల్గొన్నారు.
బిర్సాముండా స్ఫూర్తిచాటుతూ
పాడేరులో బహిరంగ సభ
ఎంవీపీ కాలనీ: బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని పాడేరు ఆదివారం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. జన జాతీయ గౌరవ దివావస్ పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. బిర్సా ముండా జయంతిని శనివారం లాసన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్తో పాటు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావులు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాధవ్ మాట్లాడుతూ బిర్సా ముండా గిరిజన హక్కులు, సాంప్రదాయాలు, సంస్కృతుల పరిరక్షణకు పెద్ద ఎత్తున కృషిచేశారన్నారు. గిరిజనుల వస్త్రదారణ, ఆచార్య వ్యవహారాల పరిరక్షణకు ఆంగ్లేయులపై పోరాడారన్నారు. ఆయని జయంతిని పురష్కరించుకొని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం పాడేరు వేదికగా బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఆదివారం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం, జిల్లా కార్యదర్శి అప్పలనర్స
బిర్సాముండా స్ఫూర్తితో ‘హైడ్రో పవర్’ వ్యతిరేక ఉద్యమం
బిర్సాముండా స్ఫూర్తితో ‘హైడ్రో పవర్’ వ్యతిరేక ఉద్యమం


