
ప్రాథమిక విద్యపై నిర్లక్ష్యం
సాక్షి,పాడేరు: మండలంలో సలుగు పంచాయతీ దబ్బగరువు గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల తెరచుకోకపోవడంతో ఇక్కడ చిన్నారులు ప్రాథమిక విద్యకు దూరమయ్యారు.ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఈనెల 12వతేదీన పాఠశాలల పునఃప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు ఉపాధ్యాయుడు రాలేదని గ్రామపెద్దలు జర్త నాగేశ్వరరావు, జర్త కొండబాబు, పెంటయ్య, భీమరాజు తెలిపారు. ఈవిషయాన్ని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలను వెంటనే ప్రారంభించి గిరిజన చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించాలని ఐటీడీఏ,గిరిజన సంక్షేమ,విద్యాశాఖ అధికారులకు దబ్బగరువు గిరిజనులు విన్నవించుకుంటున్నారు.
పనసవలసలో ఉపాధ్యాయుడు రాక..
డుంబ్రిగుడ: మండలంలోని సొవ్వ పంచాయతీ పనసవలసలో పాఠశాల తెరచుకోలేదు. సుమారు 32 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడు రాలేదని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పునః ప్రారంభమైన తరువాత మొదటి రెండు రోజులు మాత్రమే వచ్చారని, ఆ తరువాత నుంచి ఆయన జాడ లేదని వారు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి స్పందించి వెంటనే పాఠశాల తెరచుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తెరచుకోని దబ్బగరువు పాఠశాల

ప్రాథమిక విద్యపై నిర్లక్ష్యం