
గిరిజన హక్కుల పరిరక్షణకు మరో ఉద్యమం
పాడేరు : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో హక్కులు, చట్టాలు, అచార, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లకే రాజారావు పిలుపునిచ్చారు. పట్టణంలోని వీఆర్ పంక్షన్ హాల్లో ఏఐబీఎస్పీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి అధ్యక్షతన గిరిజన ఆదివాసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనాభివృద్ధి, సంక్షేమం కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలు పొందుపర్చారన్నారు. కానీ వాటిని అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అటవీ హక్కుల చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడంతో పాలకులు గిరిజన ప్రాంతంలో అత్యంత విలువైన బాకై ్సట్, ఇతర ఖనిజ సంపదపై కన్నేశారన్నారు. అడవి హక్కులను కార్పొరేట్ శక్తులు రాజ్యాంగ విరుద్ధంగా కబలిస్తున్నాయన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు, చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. కానీ పాలకులకు గిరిజనులంటే చిన్న చూపన్నారు. అందుకే గిరిజన ప్రాంత, అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నరు. తమ పార్టీ గిరిజన హక్కులు, చట్టాలు, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. గిరిజనుల పక్షాన నిత్యం పోరాటం చేస్తామన్నారు.
ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు లకే రాజారావు