
ఉద్రిక్తత నడుమ ‘ఎంటీఎస్’ కౌన్సెలింగ్
ఆరిలోవ(విశాఖ): మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు మంగళవారం ఆందోళనల నడుమ కౌన్సెలింగ్ జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను చూపించి బదిలీ ప్రక్రియ చేపడుతున్నారని, తమను మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారులు వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కౌన్సెలింగ్కు ఎవరూ హాజరు కావద్దని ఎంటీఎస్ ఉపాధ్యాయులు మరోసారి డీఈవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన జరుగుతుండగానే 1998, 2008 డీఎస్సీ బ్యాచ్లకు చెందిన కొందరు ఉపాధ్యాయులు ‘మేం కౌన్సెలింగ్కు హాజరవుతాం’ అంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మిగిలిన వారు వారిని అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఈవో ఎన్.ప్రేమ్కుమార్ ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డీఈవో కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడంతో అధికారులు సుమారు 50 మందికి పైగా ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మిగిలిన వారు బుధవారం జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. ఇదిలావుండగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం విశాఖ ఎంపీ శ్రీభరత్, ఇతర ఎమ్మెల్యేలను కలవనున్నట్లు ఎంటీఎస్ ఉపాధ్యాయ యూనియన్ నాయకులు తెలిపారు.