మార్కాపురం: ప్రజల నుంచి అందిన సమస్యలతో కూడిన అర్జీలకు పరిష్కారం దిశగా పోలీసులు పనిచేయాలని డీఎస్పీ యూ నాగరాజు ఆదేశించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెస్సల్ కార్యక్రమాన్ని డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీసు అధికారులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. అందిన ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి సత్వర పరిష్కారం కల్పిస్తామనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. ఎస్పీ కార్యాలయంలో అందిన ఫిర్యాదులను సంబంధిత పోలీసు స్టేషన్లకు తెలియచేసి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. మీకోసంలో 35 అర్జీలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు రాజేష్కుమార్, కే అజయ్కుమార్, రామకోటయ్య, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎస్పురం (పామూరు): మండలంలోని మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,06,369 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్జీఆర్ నరసింహబాబు, ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ సోమవారం తెలిపారు. స్వామివారి దర్శనం టికెట్ల అమ్మకం ద్వారా రూ.53,990, లడ్డు ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.22,640, ఆలయం వద్ద నిర్వహిస్తున్న శాశ్వత అన్నదానం పథకం నిర్వహణకు విరాళాలుగా రూ.37,127, ఇతర విరాళాల కింద రూ.92,612 విరాళంగా ఇచ్చినట్లు ఈఓ, ధర్మకర్త తెలిపారు.


