ముధోల్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో గురువారం వీడీసీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ముధోల్తో పాటు పక్క మండలాలు, మహారాష్ట్ర నుండి వచ్చిన మల్లయోధులు పోటీల్లో తలబడ్డారు. మొదటి విజేతకు రూ.5వేలు, రెండో విజేతకు రూ. 2,500 బహుమతిగా అందజేశారు.
గూడెంలో పౌర్ణమి జాతర
దండేపల్లి: మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో గురువారం చైత్రపౌర్ణమి జాతర ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 178 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. జాతరకు వచ్చిన భక్తులకు ఆలయం తరుపున ఉచిత అన్నదానం చేశారు.


