నస్పూర్: 2026–27 ఆర్థిక సంవత్సరం నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. గురువారం జీఎం కార్యాలయంలో అన్ని గనుల అధికారులతో ఉత్పత్తి ఉత్పాదకతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం 64 లక్షల 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. శ్రీరాంపూర్ ఓసీలో కొత్త కాంట్రాక్ట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఐకే ఓసీలో త్వరలోనే టెండర్ల నిర్వహణ ద్వారా మరో రెండు నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఉపరి తల గనులలో వీలైనంత త్వరగా ఉత్పత్తి మొదలు పెట్టి లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్.సత్యనారాయణ, ఏరియా ఇంజినీర్ రమణారావు, ఎస్ఆర్పీ ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ చిప్ప వెంకటేశ్వర్లు, ఐకే ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ ఏవి రెడ్డి, ఆర్కే 5 గ్రూప్ ఏజెంట్ ఎన్.శ్రీధర్, ఎస్ఆర్పీ గ్రూప్ ఏజెంట్ రవికుమార్, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


