ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ ఆశ వర్కర్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. ఎర్వచింతల్ గ్రామాన్ని సందర్శించి బాధిత ఆశవర్కర్ పద్మతోపాటు బాలింత రమణబాయిని గురువారం పరామర్శించారు. గర్భిణికి సంబంధిత అధికారులు, సిబ్బంది వైద్యం నిలిపివేయడం అమానుషమన్నారు. వైద్య శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతోపాటు సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటు చేసుకుందన్నారు. ఘటనపై ఆయా శాఖల అధికారులు సమగ్ర విచారణ చేసి బాధితురాలికి రక్షణ కల్పించడంతోపాటు బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాత, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు గంగమణి, తదితరులు పాల్గొన్నారు.


