కై లాస్నగర్: ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రైతుబీమాతో పాటు రూ.6లక్షల నష్టపరిహారం చెల్లించాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట దిగుబడి రాకపోవడం, రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బేల మండలంలోని పాటన్ గ్రామానికి చెందిన గడ్డం రాంరెడ్డి కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. రైతు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మృతుడు తనకున్న 5ఎకరాల భూమితో పాటు 18 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, సోయబీన్ పంటలు సాగు చేశారన్నారు. అధిక వర్షపాతం నమోదు కావడంతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటట్ ఆవుల రాకేశ్, నారాయణ రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు.


