ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Feb 1 2026 3:19 AM | Updated on Feb 1 2026 3:19 AM

ఎన్ని

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

● మద్యం, నగదు పంపిణీ కట్టడిపై ప్రత్యేక దృష్టి ● సమస్యాత్మక కేంద్రాల్లో మైక్రోఅబ్జర్వర్లు ● పోలింగ్‌ శాతం పెంపునకు చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్‌ రాజర్షి షా

వివరాలు

వెల్లడిస్తున్న

కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: ‘మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం.. మద్యం, నగదు పంపిణీని పూర్తిస్థాయిలో కట్టడి చేసేలా ఇప్పటికే చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం.. అలాగే పోలింగ్‌ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం..’ అని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ఎన్నికల నిర్వహణపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు.

సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

కలెక్టర్‌: బ్యాలెట్‌ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం 17 మంది చొప్పున ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, 13 మంది నోడల్‌ అధికారులు, 15 మంది జోనల్‌ అధికారులను నియమించాం. వారికి దశలవారీగా మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా శిక్షణ అందిస్తున్నాం. పట్టణ పరిధిలో 216 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.

సాక్షి: మద్యం, నగదు కట్టడికి ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేశారు?

కలెక్టర్‌: మహారాష్ట్ర, హైదరాబాద్‌ మార్గంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరిని తనిఖీ చేసేలా పట్టణ నలువైపులా ఏర్పాట్లు చేశాం. మావల, చాంద, రాంపూర్‌, బట్టిసావర్‌గాం, బంగారుగూడతో పాటు పాటు రెండు ఎకై ్సజ్‌ చెక్‌పోస్టులను ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. వీటితో పాటు డిప్యూటీ తహసీల్దార్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌, వీడియో గ్రాపర్‌తో కూడిన ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించాం. షిఫ్టుల వారీగా 24గంటల పాటు పనిచేసేలా మూడు టీంలను అందుబాటులో ఉంచాం. వీటితో పాటు పోలీస్‌శాఖకు సంబంధించి స్పెషల్‌ పార్టీ, ఇంటర్‌ సెప్టార్‌ వాహన సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లవద్దు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే వాటిని సీజ్‌ చేస్తాం.

సాక్షి: సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఎన్ని గుర్తించారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కలెక్టర్‌: మొత్తం 216 పోలింగ్‌ కేంద్రాలుండగా అందులో 35 ప్రాంతాల్లోని 128 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మైక్రో అబ్జర్వర్లను నియమించాం. అన్ని కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఉంటుంది. పోలింగ్‌ తీరును కలెక్టరేట్‌ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

సాక్షి: పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటుంది. ఈ సారి దాన్ని పెంచేందుకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేశారు?

కలెక్టర్‌: గత ఎన్నికల్లో 77శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ సారి దాన్ని మరింత పెంచేలా దృష్టి సారిస్తున్నాం. ఓటు హక్కు ప్రాధాన్యత తెలియజేసేలా రోజు వారీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రతీ వార్డులో ఓటరు అవగాన కార్యక్రమాలను చేపడుతాం. పోలింగ్‌ రోజున పరిఽశ్రమల్లో పనిచేసే కార్మికులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇచ్చేలా ఆదేశాలు జారీచేస్తాం.

సాక్షి: ప్రలోభాల నియంత్రణకు ఏ విధంగా దృష్టి సారిస్తున్నారు.?

కలెక్టర్‌: ఎన్నికల్లో ప్రలోభాలకు తావులేకుండా ఉండేలా డయల్‌ 100తో పాటు కలెక్టరేట్‌లో 24గంటల పాటు పనిచేసేలా 18004251939 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిస్తే వెంటనే ఈ నంబర్లలో సమాచారమివ్వాలి. తక్షణమే ఎఫ్‌ఎస్‌టీలు అక్కడకు చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

సాక్షి: పోలింగ్‌ కేంద్రాల్లో సరైన వసతులు ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.. దీనిపై మీరేమంటారు?

కలెక్టర్‌: ఓటర్లు, పోలింగ్‌ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఐదు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కేంద్రాల్లో తాగునీరు, షామియానాల ఏర్పాటుతో వీల్‌ చైర్లను అందుబాటులో ఉంచుతాం. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. ఓటర్లు స్పేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పోల్‌ స్లిప్‌తో పాటు ఈసీ నిర్దేశించిన 18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని వెంట తెచ్చుకోవాలి.

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు1
1/1

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement