విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడాలి
నేరడిగొండ: విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని జిల్లా తనిఖీ బృందం అధికారులు జె.తానాజీ, ఆర్.మనోజ్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. వడూర్ ఎంపీపీఎస్తో పాటు ఉర్దూ మీడియం ప్రాథమిక ఉన్నత పాఠశాలలను శనివారం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా.. లేదా అనే విషయాన్ని విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు, వసతులపై ఆరా తీశారు. అలాగే రికార్డులను పరిశీలించారు. ఫిబ్రవరిలో మూడవ తరగతి విద్యార్థులకు జాతీయ స్థాయిలో నిర్వహించే ఎస్ఎల్ఎస్ పరీక్షలకు సంసిద్ధం చేయాలని, ప్రతిరోజూ లాంగ్వేజ్, గణితంకు సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. తనిఖీ చేసిన పాఠశాలలకు సంబంధించిన సమగ్ర నివేదికను జిల్లా విద్యాధికారి నివేదిస్తామని వారు వివరించారు.


