మూత‘బడి’కి.. మళ్లీ కళ | - | Sakshi
Sakshi News home page

మూత‘బడి’కి.. మళ్లీ కళ

Jun 26 2025 6:33 AM | Updated on Jun 26 2025 6:33 AM

మూత‘బడి’కి.. మళ్లీ కళ

మూత‘బడి’కి.. మళ్లీ కళ

● పుష్కర కాలం తర్వాత ఓపెన్‌ ● కలెక్టర్‌ చొరవతో ఐదు పాఠశాలల్లో మోగినగంట ● ‘సర్కారు’పై ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు

ఆదిలాబాద్‌టౌన్‌: మూతబడిన సర్కారు బడులు పుష్కర కాలం తర్వాత ఈ ఏడాది తెరుచుకున్నా యి. అధికారుల నిర్లక్ష్యమో.. ఉపాధ్యాయుల అలసత్వమో ఏమోగాని ఎట్టకేలకు ఆ బడుల్లో గంట మోగింది. మౌలిక వసతులు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌కు పంపడంతో ఆ ప్రభుత్వ పాఠశాలలు ఏళ్లుగా తాళం పడి వెలవెలబోయాయి. ఇటీవల కలెక్టర్‌ రాజర్షిషా ప్రత్యేక చొరవ చూపి మూతబడులన్నీ తెరిపించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో పదేళ్లకు పైగా మూసి ఉన్న 14 బడుల్లో ఐదు ఈ విద్యా సంవత్సరం పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఇన్ని రోజులు బోసిపోయిన బడులు ప్రస్తుతం విద్యార్థులతో కళకళ లాడుతున్నాయి.

మూత‘బడి’కి కారణాలెన్నో..

సర్కారు బడులు మూతపడడానికి అనేక కారణా లున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు సమ యపాలన పాటించకపోవడం, నాణ్యమైన బోధ న అందించకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం తదితర కారణాలతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రైవేట్‌కే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. తాము పడ్డ కష్టాలు తమపిల్లలు పడొద్దనుకోవడమే. అయితే కొంత మంది ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హా జరుకాకపోవడం, పిల్లలకు సరైన రీతిలో బోధన చేయకపోవడంతో సర్కారు బడులకు చెడ్డ పేరు వస్తుందనే ప్రచారం ఉంది. చాలా మంది పిల్లలు చదవడం, రాయడంలో వెనుకబడిఉండటం, అధి కారుల పర్యవేక్షణ లేకపోవడంతో బడులు మూతబడ్డాయని పలు వురు అభిప్రాయ పడుతున్నారు.

కలెక్టర్‌ చొరవతో..

కలెక్టర్‌ రాజర్షి షా చొరవతో ఏళ్లుగా మూతబడిన సర్కారు బడులు ఈ ఏడాది తెరుచుకున్నాయి. విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలను పునఃప్రారంభించాలని ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆయా కాలనీలు, గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, నాణ్యమైన విద్యాబోధన అందుతుందని వివరించారు. దీంతో తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చి తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వచ్చారు.

జిల్లాలో 14 మూతబడులు..

జిల్లాలో మూతబడిన పాఠశాలలు 14 ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్‌ పట్టణంలోని భుక్తాపూర్‌ ప్రాథమిక పాఠశాల, స్టేషన్‌ రోడ్‌, వెంకట్‌రావుపేట్‌, కేఆర్‌కే కాలనీ, బజార్‌హత్నూర్‌ మండలంలోని ఇందిరానగర్‌, భీంపూర్‌ మండలంలోని పిప్పల్‌కోటి, డబ్బకుచ్చి, గాదిగూడ మండలంలోని చిన్నకుండి, కునకాస, ఇచ్చోడ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ తలమద్రి, నార్నూర్‌ మండలంలోని భీంపూర్‌ ఎస్సీ కాలనీ, కొత్తపల్లి పాఠశాల, నేరడిగొండ మండలంలోని దాబా, సవర్గాం పాఠశాలలు పదేళ్లకు పైగా మూతబడ్డాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌లోని వెంకట్‌రావుపేట కాలనీ, భీంపూర్‌ మండలంలోని డబ్బకుచ్చి, నేరడిగొండ మండలంలోని సవర్గాం, నార్నూర్‌ మండలంలోని కొత్తపల్లి, భీంపూర్‌ ఎస్సీ కాలనీ పాఠశాలలు ఇటీవల పునఃప్రారంభం అయ్యాయి. తెరుచుకున్న ఒక్కో బడిలో ప్రస్తుతం 15 నుంచి 20 మంది విద్యార్థులు చేరారు. వీరికి పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫాం పంపిణీ చేశారు. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఐదు పాఠశాలలను తెరిచాం..

కొన్నేళ్లుగా జిల్లాలో 14 పాఠశాలలు జీరో ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్నాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఐదు పాఠశాలలను పునఃప్రారంభించాం. సమీప పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాం. ‘బడిబాట’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సౌ కర్యాలు, విద్యాబోధన విషయాలను తల్లి దండ్రులకు తెలియజేశాం. దీంతో వారు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 500 మంది ఈ ఏడాది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.

– సుజాత్‌ ఖాన్‌, సెక్టోరియల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement