
జిల్లా విపత్తు నిర్వహణ బృందం సిద్ధం
● 20 మంది సిబ్బందితో అందుబాటులోకి.. ● ‘డీడీఆర్ఎఫ్’ను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్
సాత్నాల: జిల్లాలో విపత్తులు ఎదురైన క్రమంలో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా అత్యవసరంగా స్పందించేందుకు డీడీఆర్ఎఫ్ అందుబాటులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వర్షాకాలం దృష్ట్యా వరదలు, ఇతర విపత్తులకు సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా విపత్తు నిర్వహణ బృందం (డిస్టిక్ర్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం సాత్నాల ప్రాజెక్టు వద్ద బృందం సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్సై ఆధ్వర్యంలో 20 మందితో కూడిన ఈ బృందం ఇప్పటికే ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకుందన్నారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లాలో వరదలు, అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు, రోడ్లపై చెట్లు విరిగిపడ్డ సమయంలో వీరి సేవలు సత్వరం అందుబాటులోకి వస్తాయన్నారు. రెస్క్యూ బోట్, మోటార్ మిషన్, మెడికల్ స్టక్చ్రర్, లైఫ్ జాకెట్స్, వుడ్ కట్టర్స్మిషన్ వంటి అత్యాధునిక పరికరాలను వీరి వద్ద అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, ఎస్సైలు డి.సాయినాథ్, కె ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి మురళి, ఎన్. చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.