
వేడెక్కిన.. పల్లె
● ఆశావహుల్లో ఉత్సాహం నింపిన హైకోర్టు తీర్పు ● ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం ● పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం
కై లాస్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహుల్లో రా ష్ట్ర హైకోర్టు తీర్పు నూతన ఉత్సాహం నింపింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంపై పోటీకి సై అంటున్న వారిలో జోష్ మొదలైంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం, కోర్టు కూడా ఆ దిశగా ఆదేశాలివ్వడంతో ఏ క్షణమైన నోటిషికేషన్ వెలువడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఆశావహులు ఓటర్లను ఆకట్టకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నిమగ్నం అవుతున్నారు. ఇలా పల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఇదీ పరిస్థితి..
పంచాయతీ పాలకవర్గాల గడువు గతేడాది జనవరి 31తో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. జీపీలకు ఎన్నికలు నిర్వహించాలని అప్పట్లోనే ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అయితే ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ నియమించడంతో పాటు వారి స్థితిగతులపై అధ్యయనం చేసింది. ఈ కారణంగా పంచాయతీల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. అయితే గత 18 నెలలుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. చిన్నపాటి సమస్యలు సైతం పరిష్కరించలేని దుస్థితి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై డిమాండ్ వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.
కోర్టు తీర్పుతో ..
పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తు మాజీ సర్పంచ్లు రాష్ట్ర హైకో ర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యా యస్థానం రానున్న మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలకు సై అంటున్న వారిలో ఉత్సాహం మొదలైంది. ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండటం, జిల్లా స్థాయిలో యంత్రాంగం అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తి చేయడంతో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో పల్లెపోరుకు ఆసక్తి చూపుతున్న వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అయితే రిజర్వేషన్ కలిసివస్తే పోటీలో ఉండాలని భా విస్తున్న వారంతా ఓటర్లను మచ్చిక చేసుకునే ప నిలో పడ్డారు. పంచాయతీ పోరు పార్టీలకతీతంగా జరగనున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకుంటే గెలుపు సునాయాసం కానుందని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా పార్టీల మద్దతు కూడగట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల ముఖ్యనేతల కనుసన్నల్లో పడేందుకు యత్నిస్తున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆశీస్సులు పొందేలా వ్యవహరిస్తున్నారు. మంచి, చెడులకు అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది.
జిల్లాలో..
మండలాలు : 20
గ్రామ పంచాయతీలు : 473
మొత్తం వార్డులు : 3,870
పోలింగ్ కేంద్రాలు : 3,888
ఓటర్లు : 4,51,707