
● నాలుగేళ్లుగా విత్తన సబ్సిడీ ఎత్తివేత ● ప్రైవేట్లో ఏట
ఈ ఫొటోలోని రైతు పేరు రాథోడ్ రాందాస్. ఇతనిది ఇచ్చోడ మండలం దేవుల్నాయక్ తండా. ఇతడు నాలుగేళ్లుగా వానాకాలంలో 6 నుంచి 8 ఎకరాల్లో సోయా సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం నాలుగేళ్లుగా సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయకపోవడం, ప్రైవేట్లో విత్తనాల ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది రెండెకరాల్లోనే సోయా సాగు చేశాడు. జిల్లాలో ఇలా అనేక మంది రైతులు సోయా సాగును తగ్గిస్తున్నారు.
ఇచ్చోడ: జిల్లాలో సోయాసాగు నాలుగేళ్లుగా తగ్గు తూ వస్తోంది. పత్తికి ప్రత్యామ్నాయ పంటగా జిల్లాలో చాలామంది రైతులు సోయా సాగు చేసేవారు. సోయా విత్తనాలపై ప్రభుత్వంసబ్సిడీ ఎత్తివేయడం, ఏటేటా ప్రైవేట్లో విత్తనాల ధరలు పెరగడంతో రైతులు సాగుకు ముందుకు రావడంలేదు. జిల్లాలో గతంలో పత్తికి సమానంగా సోయా సాగయ్యేది. నాలుగేళ్లుగా సోయా సాగు సగానికి పడిపోయింది.
పెరుగుతున్న విత్తనాల ధర
ప్రభుత్వం 30కిలోల సోయా విత్తనాల సంచినిఽ రూ.1,718కు పంపిణీ చేసేది. ఎకరాకు 30 కిలోల విత్తనాలు సరిపోయేది. దీంతో రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా సాగు చేశారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడంలేదు. ప్రైవేట్లో సోయా విత్తనాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 2023–24లో 30 కిలోల విత్తనాల సంచి ధర రూ.2.650, 2024–25లో రూ.2,800కు పెరిగింది. 2025–26లో ప్రైవేట్ కంపెనీలు ఇంకా ధరలు నిర్ణయించలేదు. ప్రైవేట్లో విత్తనాల ధరలు ఏటేటా పెరుగుతుండడం రైతులకు భారంగా మారింది. ఐదెకరాల్లో సాగు చేయాలంటే ఐదు సోయా విత్తనాల బస్తాలకు ప్రైవేట్లో రూ.14 వేలు అవుతుండగా, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తే రూ.8,590 మాత్రమే అయ్యేది. ఐదెకరాల్లో సాగు చేసే రైతుపై రూ.5,410 అదనపు భారం పడుతోంది. సబ్సిడీ విత్తనాల సరఫరా నిలిచిపోవడం, ప్రైవేట్లో విత్తనాల ధర ఏటా పెరిగిపోతుండడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సోయా సాగును తగ్గిస్తున్నారు. నీటి సౌకర్యముండి వానాకాలం, రబీలోనూ సోయా సాగు చేసిన రైతులు ఇప్పుడు ఒక్క సీజన్లో కూడా సాగు చేసేందుకు ముందుకు రావడంలేదు.
జిల్లాలో సోయా సాగు వివరాలు
సంవత్సరం విస్తీర్ణం (ఎకరాల్లో)
2023–24 1,32,363
2024–25 65,464
2025–26 62,500