
● అనుమతి లేకుండా వాటర్ ప్లాంట్లు ● నాణ్యత ప్రమాణాలకు త
ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ప్లాంట్ ఆదిలాబాద్లోని విద్యానగర్ లోనిది. ఈ యజమాని మరో చోట నుంచి వాహనంలో నీటిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నాడు. ప్యూరిఫైడ్ చేయకుండానే ప్రజలకు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 20 లీటర్ల క్యాన్కు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నాడు.
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ప్యూరిఫైడ్ వాటర్ పేరిట ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వేసవి కా వడంతో నీటి దందా జోరందుకుంది. అయితే వీటికి అనుమతులు ఉండవు.. ప్రమాణాలు పాటించరు.. నిర్వహణ సైతం ఇష్టారీతిన కొనసాగుతోంది. రక్షిత నీటిని తాగాలనే ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్యూరిఫైడ్ పేరిట ఏటా లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు కొందరు. ప్రజలకు క్యా న్లలో కలుషిత నీటిని అందిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం గమనార్హం.
నీటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే...
జిల్లాలో సుమారు 700 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కదానికి కూడా అనుమతి లేదు. ఐఎస్ఐ నిబంధనలు సైతం పాటించడం లేదు. ఏడాదికోసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఎక్కడా అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇళ్లు, దుకాణాలు, పాత గదుల్లోనే ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు సైతం ఎక్కడా నిర్వహించడం లేదు. ఏటా వేసవిలో ప్యూరిఫైడ్ నీటికి గిరాకీ ఉంటుంది. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు అనుమతి లేకుండా ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. గతంలో పట్టణాలకు పరిమితం కాగా ప్రస్తుతం గ్రామాలకు సైతం విస్తరించాయి. క్యాన్కు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీటి శుద్ధికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉన్న ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్లాంట్లలో క్యాన్లు శుద్ధి చేయకుండానే సాధారణ నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. కాలం చెల్లిన క్యాన్లు ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆదిలాబాద్లోని ఓ వాటర్ ప్లాంట్ నిర్వహణ తీరిలా..
ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ప్లాంట్ ఆదిలాబాద్లోని కొత్త కుమ్మర్వాడ సమీపంలోనిది. ఇక్కడి నుంచి రోజుకు వందలాది క్యాన్లు సరఫరా అవుతున్నాయి. అయితే రోజుకు 4వేల లీటర్ల నీటిని బోరు నుంచి తోడితే ఇందులో 25 శాతం మాత్రమే ప్యూరిఫైడ్ అవుతుంది. మిగతా 75 శాతం వృథా అవుతుంది. ఇలా నీటి వృథాతో కాలనీలోని ఇళ్లలో ఉన్న బోర్లకి నీరు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో గల్లీకి ఒకట్రెండు చొప్పున ఇలా ప్లాంట్లు అక్రమంగా వెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
నిబంధనలు ఇవి..
వాటర్ ప్లాంట్కు మున్సిపల్/గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలి.
పరిశ్రమల శాఖ నుంచి పార్టు–1 లైసెన్సు పొందాలి.
నిర్వహణకు బీఎస్ఐ అనుమతి ఉండాలి. ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి.
ప్లాంట్లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రి సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి.
పీహెచ్ స్థాయి 7 కంటే తగ్గకుండా చూడాలి. తగ్గితే ఆ నీరు తాగిన వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.
ప్లాంట్లో ప్రయోగశాలతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి.
నీటిని సరఫరా చేసే క్యాన్ అపరిశుభ్రంగా ఉండకూడదు. ప్రతిరోజు పొటాషియం పర్మాంగనేట్తో క్లీనింగ్ చేయాలి. అలాగే ప్రతి క్యాన్పై శుద్ధి చేసిన తేది, బ్యాచ్ నంబర్ ఉండాలి.
శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన పెద్ద ట్యాంకులో నింపి ఓజోనైజేషన్ చేయాలి.
అయితే జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క ప్లాంట్లో కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు.
అనుమతి లేని ప్లాంట్లపై చర్యలు
జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను తనిఖీ చేస్తాం. అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించని వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్

● అనుమతి లేకుండా వాటర్ ప్లాంట్లు ● నాణ్యత ప్రమాణాలకు త

● అనుమతి లేకుండా వాటర్ ప్లాంట్లు ● నాణ్యత ప్రమాణాలకు త