
ఎల్ఆర్ఎస్ గడువు మళ్లీ పొడిగింపు
● ఈ నెల 3వరకు అవకాశం ● ఈ సారైనా స్పందించేనా?
కై లాస్నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 25శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపు గడువు బుధవారంతో ముగియగా దాన్ని మే 3వరకు పొడిగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి టి కే. శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే నెల గడువు పొడిగించగా జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన సంబంధిత అధికా రుల మధ్య సమన్వయం కొరవడడం వంటి కారణాలతోనే ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎల్ఆర్ఎస్ కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ ఫీజు చెల్లించేందుకు మాత్రం చాలా మంది ముందుకు రాలేదు. సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రుసుం రూపేణ రూ.7.60 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఆదాయం వచ్చింది, ఎన్ని దరఖాస్తులకు ఫీజు చెల్లించారనే వివరాలు పంచాయతీ అధికారుల వద్ద అందుబాటులో లేకపోవడం చూస్తుంటే ఈ ప్రక్రియపై వారు ఎంత చిత్తశుద్ధి కనబరుస్తున్నారనేది స్పష్టమవుతోంది. దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఆదిలాబాద్ మున్సిపల్తో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. కాగా మరో మూడు రోజులు అవకాశం కల్పించడంతో దరఖాస్తుదారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.