
ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం
బజార్హత్నూర్: మండలంలోని దేగామ గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు దాదాపు 10 ఎకరాల జొన్న పంట దగ్ధమైంది. ఎంఆర్ఐ నూర్సింగ్ కథనం ప్రకారం.. గ్రామంలో మధ్యాహ్నం కొత్తకొండ లక్ష్మీ పంటచేనులో జొన్నపంటకు మంటలు అంటుకున్నాయి. కొన్ని క్షణాల్లో చుట్టుపక్కల చేలకు మంటలు విస్తరించి దాదాపు 10 ఎకరాల జొన్న పంటతోపాటు 100 పైపులు, స్పింక్లర్లు కాలి బూడిదయ్యాయి. ఘటన స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్రావు, ఆడె గజేందర్, జల్కే పాండురంగ్, నారాయణ పరిశీలించారు.ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తాంసిలో రెండెకరాలు..
తాంసి: మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం నిప్పంటుకుని రెండెకరాల్లో జొన్న పంట దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి..సోమ గంగారెడ్డి పంటచేను పక్కన ట్రాన్స్ఫార్మర్ వద్ద చెలరేగిన నిప్పురవ్వలతో మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో రెండెకరాల్లో జొన్న పంట దగ్ధమైంది. స్థానికులు నీళ్లను చల్లి మంటలార్పివేశారు. అగ్ని ప్రమాదంలో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన మరో రైతు సతీశ్ చేనులో అకస్మాత్తుగా మంటలు వ్యాప్తి చెంది పదికి పైగా స్పింక్లర్ల పైపులు దగ్ధమయ్యాయి.