
ప్రమాదవశాత్తు మొక్కజొన్న దగ్ధం
సారంగపూర్: మండలంలోని ధని గ్రామంలో ప్రమాదవశాత్తు ఆరబెట్టిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శనిగారపు చిన్నరాజేశ్వర్ ఎకరంలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోతకోసి ఆరేందుకు పంటపొలంలో ఉంచాడు. శుక్రవారం రైతు పంటను పరిశీలించి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు పంటకు నిప్పంటుకుంది. ఇతర రైతులు గమనించి రాజేశ్వర్కు సమాచారం అందించారు. బోరుబావుల మోటార్లు ఆన్ చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే 90శాతం పంట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.80వేల పంట నష్టం జరిగిందని రైతు వాపోయాడు. ఎంఆర్ఐ నర్సయ్యకు ఫోన్లో సమాచారం అందించగా ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పంటనష్టం అంచనా వేశారు.