● అంగన్వాడీలకు కందిపప్పు సరఫరా చేసే కాంట్రాక్టర్ ఎంపి
ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో..
– మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి
రాష్ట్ర అధికారుల నుంచి టెండర్ల విషయంలో సరైన నిర్ణయం రాకపోవడంతో రెండు నెలల కోసం పాత కాంట్రాక్టర్కే కిలోకు రూ.162 చొప్పున సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాం. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంటున్నాం. ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్ నిర్వహించాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా ముందుకెళ్తాం.
అసలేం జరిగిందంటే..
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జిల్లాల పరిధిలో అంగన్వాడీలకు కంది పప్పు సరఫరా చేసే కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. అయితే పలు జిల్లాల్లో టెండర్ నిబంధనలను ఉల్లంఘించారు. ఆదిలాబాద్ జిల్లాలో అసలు టెండరే నిర్వహించకుండా కంది పప్పు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ను నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేశారు. అదికూడా గతం నుంచి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్కే వత్తాసు పలుకుతూ అప్పగించడం విమర్శలకు తావిచ్చింది. దీంతో ప్రస్తుతం ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారిగా వ్యవహరిస్తున్న మిల్కా తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన కాంట్రాక్ట్లను ప్రభుత్వం గురువారం రద్దు చేసింది. కలెక్టర్ నేతృత్వంలోనే కొనుగోలు కమిటీ ద్వారా మాత్రమే టెండర్లు పిలిచి కాంట్రాక్ట్లు ఖరారు చేయాలని ఆదేశించింది.
జిల్లాలో అక్రమాలు ఇలా..
నిబంధనల ప్రకారం టెండర్లను ఆహ్వానించి తక్కు వ ధరకు కోట్ చేసే కాంట్రాక్టర్ను ఎంపిక చేయాలి. అయితే కంది పప్పు కొనుగోలుకు రాష్ట్రస్థాయి అధికారులు నిర్ణయించిన గరిష్ట ధర రూ.164. దీన్ని జిల్లా సంక్షేమ అధికారి తనకు అనువుగా మలుచుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఎలాంటి టెండర్ లేకుండా కాంట్రాక్టర్ను ఎంపిక చేశారు. మార్కెట్లో ప్రస్తుతం కంది పప్పు నాణ్యతను బట్టి ధర రూ.90 నుంచి రూ.130 కిలో చొప్పున ధర పలుకుతుంది. అయితే ఇటీవల జిల్లాలో నామినేషన్ పద్ధతిపై వరంగల్కు చెందిన శివసాయి ట్రేడర్స్కు కిలోకు రూ.162 చొప్పున కాంట్రాక్ట్ అప్పగించారు. దీనిపైనే ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా వందల టన్నుల కంది పప్పు సరఫరా అంగన్వాడీలకు జరుగుతుండగా, ఇలా నామినేషన్ పద్ధతిపై అప్పగించడంలో సంక్షేమ అధికారి లోపాయికారితనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొనుగోలు కమిటీ నిస్తేజం..
సాధారణంగా అంగన్వాడీలకు సరఫరా చేసే సరుకుల టెండర్లకు సంబంధించి కొనుగోలు కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ఈ కమిటీలో జిల్లా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అయితే కొంత కాలంగా అంగన్వాడీలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల ఎంపికలో ఈ కమిటీ పాత్ర నిస్తేజంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా జిల్లా యంత్రాంగానికి అవినీతి మచ్చ అంటగట్టినట్టు అయ్యింది. ఇలా అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడమే ఇప్పుడు విమర్శలకు తావిస్తున్నాయి. స్వయంగా ఇన్చార్జి మంత్రి సీతక్క పర్యవేక్షణ చేస్తున్న శాఖకు సంబంధించి జిల్లాలో అడ్డగోలుగా వ్యవహారాలు సాగుతుండడంతో అందరు ముక్కున వేలేసుకునే పరిస్థితి తలెత్తింది.
కంది పప్పు సరఫరా ఇలా..
జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఐదు ప్రాజెక్టులు ఆదిలాబాద్, జైనథ్, బోథ్, నార్నూర్, ఉట్నూర్లో ఉన్నాయి. వీటి పరిధిలో 1,256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతలు 10వేల మంది ఉండగా, చిన్నారులు 22వేలు ఉన్నారు. వీరికి పాలు, గుడ్లు, ముర్కుల్, బాలామృతం అందజేస్తారు. ఒకపూట భోజనం అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వమే బియ్యం సరఫరా చేస్తుంది. ఇక కంది పప్పు, నూనె, ఇతరత్రా సామగ్రిని కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తారు. జిల్లాలో ప్రతి రెండు నెలలకోసారి 20 టన్నుల చొప్పున ఏడాదికి సుమారు 120 టన్నుల కంది పప్పు సరఫరా అవుతుంది.


