● కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విడుదల కాని వైనం ● నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై ప్రభావం
బోథ్: నియోజకవర్గాల అభివృద్ధి పథకానికి గ్రహ ణం పట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి పథకం(సీడీపీ) కింద వచ్చే నిధులు మాత్రం విడుదల కావడం లేదు. దీంతో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.
గతంలో ఇలా..
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ప్రజలు ఇచ్చిన అర్జీల పరిష్కారం, సదుపాయాల కల్పన, తక్షణ అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.3 కోట్లు కేటాయించగా, ఆ నిధులను 2022–23లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5కోట్లకు పెంచింది. ఇందులో రూ.3కోట్లను ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టే అవకాశం ఉండగా, మిగిలిన రూ.2కోట్లు మాత్రం విద్యాశాఖలో పాఠశాలల అభివృద్ధికి వెచ్చించాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే విద్యాశాఖకు కేటాయించిన నిధులను మాత్రం గత ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా ఈ నిధులను నిలిపివేయడంతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతుంది. నిధులు విడుదల చేస్తే తాగునీరు, రహదారులు, అసంపూర్తి భవనాల పూర్తి, గ్రామాల్లో సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించే అవకాశం ఉంటుంది.
ఎమ్మెల్యేలకు నిరాశే..
జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని కొంత భాగం, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని కొంతభాగం జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆదిలాబాద్ నియోజవర్గానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రాతినిథ్యం వహిస్తుండగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కోవ లక్ష్మి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి సీడీపీ నిధులు విడుదల కాకపోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఎస్డీఎఫ్తోనే అభివృద్ధి పనులు..
సీడీపీ నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడంతో నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి నిధుల(ఎస్డీఎఫ్)తోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రతీ నియోజకవర్గానికి ఎస్డీఎఫ్ కింద రూ. 10 కోట్లు మంజూరవుతాయి. ఈ నిధులను ఇన్చార్జి మంత్రి ఆమోదంతో పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండడంతో వారు పంపిన ప్రతిపాదనల్లో కొన్ని పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ నియోజకవర్గాలోని కాంగ్రెస్ ఇన్చార్జిలు ప్రతిపాదించిన పనులకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయా ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. తమను ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారని, నిధులు విడుదల చేయకపోవడం, ప్రతిపాదించిన పనులకు ఆమోదంచకపోవడం ఏంటిని వారు ప్రశ్నిస్తున్నారు. సీడీపీ నిధులు త్వరగా విడుదల చేస్తే నియోజకవర్గాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని వారు పేర్కొంటున్నారు.
సీడీపీ నిధులు విడుదల చేయాలి
రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు సీడీపీ నిధులు మంజూరు చేయడం లేదు. అవి విడుదల చేస్తే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. అలాగే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుంది. – అనిల్జాదవ్, ఎమ్మెల్యే, బోథ్