● జిల్లా కేంద్రంలో గతేడాది ఓ వ్యక్తి ఆన్లైన్ గేమ్ ఆడి రూ.లక్షల్లో నష్టపోయాడు. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన ఆన్లైన్ బెట్టింగ్ బారిన పడి అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. ఈ క్రమంలో పట్టణంలోని ఏరోడ్రామ్ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.
● ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్కు చెందిన ఓ వ్యక్తి గతేడాది యాప్లో క్రికెట్కు సంబంధించి బెట్టింగ్ పెట్టాడు. మధ్యవర్తికి డబ్బులు పంపడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయన ఇంటికి వెళ్లి మందలించారు. మరోసారి బెట్టింగ్కు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించి వదిలిపెట్టారు.
ఆదిలాబాద్టౌన్: ఆన్లైన్ బెట్టింగ్తో యువత జీవితాలు నాశనమవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. జిల్లాలో సైతం కేసులు అంతకంతకీ పెరిగిపోతున్నాయి. యువత రోజురోజుకు ఆన్లైన్ గేమ్లపై ఆసక్తి చూపుతూ బెట్టింగ్స్ వరకు వెళ్తున్నారు. ఐపీఎల్ ప్రారంభంతో ఆన్లైన్ బెట్టింగ్కు క్రేజ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది దందాగా మలుచుకుంటున్నారు. యువతతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు బెట్టింగ్ యాప్ల మోజులో పడుతున్నారు. చిన్నవయసులోనే ఆర్థిక నష్టాలను చవిచూస్తున్న ఘటనలు జిల్లాలోనూ చోటు చేసుకుంటున్నాయి. పట్టణాలకే పరిమితం కాకుండా ఆయా మండలాల్లో సైతం ఈ భూతం బారిన పడి పలువురు నష్టాల పాలవుతున్నారు. కొంత మంది కూలీనాలి చేసుకునే వారు, ప్రైవేట్ ఉద్యోగులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇందులో పెట్టి ఆర్థిక ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు.
జోరుగా దందా..
నిషేధిత యాప్ల ద్వారా యువత ఆన్లైన్ బెట్టింగ్స్ కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యల్లో వెబ్సైట్లు, యాప్లలో ఈ బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. వీటిపై నిషేధం ఉన్నప్పటికీ యాప్ల ద్వారా లొకేషన్ చేంజ్ చేస్తూ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎక్కువ బెట్టింగ్ బారిన పడుతున్నారు. జట్టులో ఆటగాళ్ల తీరు, మ్యాచ్ గెలిచేదెవరు.. ఫోర్, సిక్స్ ఇలా అనేక అంశాలపై వేల రూపాయల్లో బెట్టింగ్ పెడుతున్నారు. యువకులతో పాటు పలు వ్యాపారులు సైతం ఈ మోజులో పడి అప్పుల పాలవుతున్నారు. కొంత మంది విద్యార్థులు, యువత తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు సైతం అనుసంధానం చేసి వారిని సైతం సమస్యల్లోకి నెట్టుతున్నారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై పోలీసులు చర్యలకు పూనుకుంటున్నారు. ఈ క్రేజ్ను దందాగా మలుచుకొని కొంత మంది బెట్టింగ్ యాప్ల ద్వారా జేబులు నింపుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తుండడం గమనార్హం.
కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న యాప్లు ఐపీఎల్ షురూతో జిల్లాలో జోరుగా బెట్టింగ్స్
వ్యసనంతో ఆర్థికంగా నష్టపోతున్న యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు
ఏటా రూ.లక్షల్లో కొనసాగుతున్న దందా
ఆన్లైన్ బెట్టింగ్స్పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీఎస్ పోలీసులు సైతం అలాంటి వారిపై కన్నేసి ఉంచారు. ఎక్కడైనా ఆన్లైన్ బెట్టింగ్ పెడుతున్నట్లు సమాచారం అందిస్తే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. వారిపై కేసులు పెట్టి కటకటాల పాలు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం ఉంది. ఇటీవల ప్రభుత్వం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలి..
ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉండాలి. రాష్ట్రంలో దీనిపై నిషేధం అమలులో ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బెట్టింగ్కుపాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవు. చాలా మంది ఈ వ్యసనానికి గురై ఆర్థికంగా నష్టపోతూ చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విలువైన జీవితాలను నాశనం చేసుకుంటూ కుటుంబీకులకు తీరని విషాదం మిగుల్చుతున్నారు. ఎక్కడైనా ఆన్లైన్ బెట్టింగ్ జరిగితే 8712659973 నంబర్పై సమాచారం అందించాలి. వివరాలు గోప్యంగా
ఉంచుతాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ
భోరజ్ మండలం పిప్పర్వాడలో గల ఓ ప్రైవేట్ కళాశాలలో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్న ఓ యువకుడు ఈ ఏడాది జనవరిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి గురై డబ్బులు పొగొట్టుకోవడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికంది వచ్చిన కొడుకు దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పోలీసుల ప్రత్యేక నిఘా..
పోలీసుల ప్రత్యేక నిఘా..