
మాట్లాడుతున్న ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి
● ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి
ఆదిలాబాద్టౌన్: గణపతి నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో పోలీసు అధికారులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదిలాబాద్ పట్టణంలోని వన్టౌన్లో 4, టూటౌన్లో 3, మావల పోలీస్స్టేషన్లో 3 చొప్పున పది సెక్టార్లుగా విభజించి బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సెక్టార్లలో ఎస్సై, ఏఎస్సై స్థాయి అధికారులు ఇన్చార్జీలుగా ఉంటారని తెలిపారు. ప్రతి రెండు సెక్టార్లను క్లస్టరుగా విభజించి ఒక సీఎస్ అధికారి ఇన్చార్జీగా ఉండి 24 గంటలు పర్యవేక్షిస్తుండేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అదనంగా సున్నితమైన, ఎక్కువ ప్రజల సందర్శన ఉండే ప్రాంతాల వద్ద పికెట్స్, ఫుట్ పెట్రోలింగ్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తూ, నిరంతర సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరువేసేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా ఐదు నిమిషాల్లో ఘటనా స్థలానికి సిబ్బంది చేరుకునేలా నిరంతరం అప్రమత్తమై విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. రాత్రి సమయంలో మండపాల వద్ద నిర్వాహకులు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ మండపం వద్ద పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది గణపతి ఉత్సవాలు, నిమజ్జనం పూర్తయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఉమేందర్, సీఐలు కె.సత్యనారాయణ, ఎ.అశోక్, ప్రణయ్కుమార్, సైదారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ నవీన్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.