
కైలాస్నగర్: జిల్లాలో విద్యుత్ వినియోగం రో జురోజుకూ పెరుగుతోంది. భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో మధ్నాహ్యం 12 గంటలు దాటితే చాలు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. గత నెల ఫిబ్రవరి వరకు వాతావరణం చల్లగా ఉండడంతో విద్యుత్ వినియోగం అంతగా జరుగలేదు. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఇందుకు అనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా అధికమవుతోంది. ఇళ్లలో కూలర్లు, ఏసీల వాడకం అధికం అవుతోంది. వ్యవసాయానికి సంబంధించి రైతులు రబీలో మొక్కజొన్న, వేరుశనగ, జొన్న పంటలతో పాటు కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఆయా పంటలకు నీరందించేందుకు మోటా ర్లు నడుస్తున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం అధికమై దాని ప్రభావం ట్రాన్స్ఫార్మర్లపై పడి కాలిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ డిమాండ్ కూడా మరింత పెరిగే అవకాశముందని విద్యుత్శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు
జిల్లాలో రబీ పంటలు సాగవుతున్నాయి. ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, జైనథ్, తలమడుగు, ఇచ్చోడ, ఉట్నూర్, తాంసి వంటి మండలాల్లో వేరుశనగ, మొక్కజొన్న, జొన్నపంటలతో పాటు కూరగాయలను ఎక్కువగా పండిస్తున్నారు. జిల్లాలో 29,866 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇవీ 24గంటల పాటు నడుస్తుంటాయి. అయితే ఇటీవల ఎండల తీవ్రత అధికం కావడంతో పంటలకు నీటి విని యోగం సైతం పెరుగుతోంది. ఫలితంగా మోటార్లు ఒకేసారి ఆన్ చేస్తుండడంతో విద్యుత్ వినియోగం అధికమవుతోంది. కెపాసిటీకి మించి వినియోగం జరుగుతుండడంతో దాని ప్రభావం ట్రాన్స్ఫార్మర్లపై పడుతోంది. ఫలితంగా ఆ భారాన్ని తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ప్రతి నెలా 50కి తగ్గకుండా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురవుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండంతో విద్యుత్ శాఖపై భారం పడుతుండగా వాటిని మార్చేందుకు రైతులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దాన్ని పంట పొలం నుంచి తీసుకువచ్చి, మరమ్మతులు చేయించి తిరిగి పంట పొలం వద్ద ఏర్పాటు చేయాల్సిన బాద్యత విద్యుత్శాఖదేనని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ విషయంపై రైతులకు అవగాహన లేకపోవడం, కొన్నిచోట్ల విద్యుత్ అధికారులకు తెలియజేసినా వారు స్పందించకపోవడంతో రైతులే వాటిని జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ కార్యాలయానికి తీసుకువచ్చి మరమ్మతుల అనంతరం తీసుకెళ్తున్నారు. ఇందుకు ప్రైవేట్ వాహనాలు అవసరం కావడంతో రైతులు వాటికోసం అదనపు భారం మోయాల్సి వస్తోంది.
ఇళ్లలోనూ పెరుగుతున్న వినియోగం
ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచే ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి. దీంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరగడంతో ఇళ్లలోనూ విద్యుత్ వినియోగం అధికమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,57,521 గృహావసర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి గానూ 9.84 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమవుతోంది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందువల్ల విద్యుత్ వినియోగం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.
నాలుగు నెలల్లో విద్యుత్ వినియోగం,
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు
నెల విద్యుత్ వినియోగం కాలిన
(మి.యూనిట్స్లలో) ట్రాన్స్ఫార్మర్లు
డిసెంబర్ 13.48 59
జనవరి 14.42 57
ఫిబ్రవరి 14.21 55
మార్చి 15 55
విద్యుత్ పొదుపుగా వాడాలి
ఏప్రిల్, మే నెలల్లో కూలర్లు, ఏసీల వాడకంతో 20 శాతం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పడి అవి కాలిపోయే అవకాశం ఉంది. వినియోగదారులపై భారం పడకుండా ఫిబ్రవరిలో ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకుని అదనంగా ట్రాన్స్ఫార్మర్లు తెప్పించుకుంటున్నాం. ఇండస్ట్రియల్ , వ్యవసాయ కనెక్షన్లకు తప్పనిసరిగా కెపాసిటర్లను ఏర్పాటు చేసుకుంటే ట్రాన్స్ఫార్మర్లపై అంతగా భారం పడదు. రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించుకోవాలి. గృహావసర వినియోగదారులు నాణ్యమైన విద్యుత్ పరికరాలనే ఉపయోగించాలి. అవసరం లేకుండా లైట్లు, ఫ్యాన్లు వాడకూడదు. ఎల్ఈడీ బల్బులను వినియోగించాలి. ప్రతిఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వాడాలి. – కె.సంపత్కుమార్, ఎస్ఈ, జిల్లా విద్యుత్శాఖ