ఓటేస్తే పెట్రోలు, రీచార్జి ఆఫర్లు.. నానో కారు!!
మీరు ఓటేసి వచ్చారా.. ఇంకు గుర్తు కూడా మీ వేలి మీద ఉందా? అయితే పెట్రోలు పోయించుకునేటప్పుడు అందులో మీకు 10 శాతం రాయితీ లభిస్తుంది. అంతేకాదు, సెల్ఫోన్ రీచార్జి చేయించుకున్నా కూడా ఆఫర్లు ఉంటాయి. మీ గ్రామం మొత్తంలో 95 శాతం వరకు ఓటింగ్ జరిగితే.. గ్రామానికి ఓ నానో కారు బహుమతిగా రావచ్చు. అదే 90 శాతం ఓటింగ్ జరిగితే గ్రామాల్లోని రైతులకు మోటారు పంపు ఇస్తారు. ఈ ఆఫర్లన్నీ మెదక్ జిల్లాలో ఓటర్లకు ఆ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ అందిస్తున్న బహుమతులు!! అయితే, వీటిలో చిన్నచిన్న బహుమతులు నేరుగా అందితే, పెద్దవి మాత్రం లక్కీడిప్ ద్వారా మాత్రమే వస్తాయి.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మెదక్ జిల్లా అధికార యంత్రాంగం భారీ ప్రచారాన్ని చేపడుతోంది. జిల్లాలో గత ఎన్నికల్లో తక్కువగా ఓటింగ్ నమోదు కావడంతో ఈ సారి జిల్లా కలెక్టర్ ఓటరు అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. యువ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపడంలేదని గ్రహించిన అధికార యంత్రాంగం.. వారిని ఆకర్షించేందుకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఓటింగ్లో పాల్గొంటే బైక్లో పెట్రోల్, సెల్ రీఛార్జి వంటి ఆఫర్లు ఇవ్వనున్నారు. ఎక్కువ శాతం పోలింగ్ నమోదైన గ్రామానికి లక్కీడీప్ ద్వారా ఓ నానో కారు, ఎసి, రిప్రిజిరేటర్ తదితర వస్తువులను కూడా బహుమతులుగా అందజేయనున్నారు.
ఓటింగ్లో పాల్గొనే వృద్ద ఓటర్లకు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలను చేపడుతున్నారు.అత్యధిక శాతం ఓటింగ్ జరిపి అగ్రస్థానంలో నిలపాలన్న తపనతో అనేక రకాల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు మెదక్ కలెక్టర్.