breaking news
rigistration
-
త్వరలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామాలకు సంబంధించి భూయజమానులకు త్వరలోనే క్రమబద్ధీకరించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనున్నట్టు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. మంగళవారం పద్దులపై చర్చ సందర్భంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లకు సంబంధించి సభ్యుల సందేహాలను నివృత్తి చేసే క్రమంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. తెలంగాణలో భూ వివాదాలకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సాదాబైనామాలకు సంబంధించి క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ విక్రయ లావాదేవీలకు సంబంధించి తెల్లకాగితాలపై రాసుకున్నవారి వివరాలు రికార్డుల్లోకెక్కలేదని, యజమానులైనప్పటికీ రికార్డుల్లో వారి పేర్లు లేకపోవడంతో వివాదాలకు అవకాశం కలుగుతోందన్నారు. ఇలాంటి వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా తొలుత 15.68 లక్షల దరఖాస్తులు వచ్చా యని, వీటిల్లో 6.18 లక్షలను క్లియర్ చేసినట్లు వెల్లడిం చారు. ఆ తర్వాత 2 దఫాలు గా అవకాశం ఇవ్వగా మరో 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశానికి సంబంధించి కోర్డులో కేసు దాఖలు కావటంతో క్రమబద్ధీకరణ పెండింగ్లో పడిందన్నారు. కోర్టు కేసు క్లియర్ కాగానే రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని సభకు వివరించారు. భూ రిజిస్ట్రేషన్లో ఎవరి జోక్యం లేకుండా, అంతా ఆన్లైన్ విధానంతో జరిగేలా రూపొందించిన ధరణి పోర్టల్ రైతులకు పెద్ద వరంలాంటిదన్నారు. ధరణి వ్యవహారం ఓ చరిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతం.. రాష్ట్రంలో ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చిపెట్టే మూడు ప్రధాన శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతమని మంత్రి కొనియాడారు. కేవలం 1,300 సిబ్బందితో ఈ శాఖ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సజావుగా సాగేందుకు వీలుగా నిధులను సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కోవిడ్తో గత ఆర్థిక సంవత్సరం ఇబ్బంది ఉండగా, అంతకుముందు యేడు 1,300 మంది సిబ్బంది, 141 కార్యాలయాల ద్వారా 15.34 లక్షల భూలావాదేవీలతో రూ.6,620 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిం దన్నారు. త్వరలో రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించనున్నామని, పార్ట్–బీలో ఉన్న వివాదాలను మొదటి దశలోనే పరిష్కరిస్తామని, ఇందుకు బడ్జెట్లో రూ.400 కోట్లు ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. -
వేటకత్తితో తమ్ముడిపై అన్న దాడి
సాక్షి, భీమిని(నెన్నెల) : నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిపై అన్న బాపురెడ్డి బుధవారం నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలోనే వేట కత్తితో హత్యాయత్నం చేశాడు. భూతగాదనే అన్నదమ్ముల మధ్య గొడవకు దారితీసింది. బొప్పారం గ్రామశివారులో సర్వేనంబర్707/1లో 3.14ఎకరాలు, 708 సర్వే నంబర్లో 4.36ఎకరాలు ఉన్న ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బాపురెడ్డి తన వాటలోని కొంత భూమిని ఇతరులకు అమ్ముకున్నాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించేందుకు తమ్ముడు సంతకం చేయాల్సి ఉంది. కాగా బుధవారం రిజిస్ట్రేషన్ కోసం నెన్నెల తహసీల్దార్ కార్యాలయానికి అన్నదమ్ములిద్దరు వేర్వేరుగా వచ్చారు. తమ్ముడు అభ్యంతరం చెప్పాడని ముందుగానే ఊహించిన బాపురెడ్డి పథకం ప్రకారం తన వెంట ఓ కవర్లో కారంపొడి, వేటకత్తి తెచ్చుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ విషయమై మాటమాట పెరిగి గొడవకు దిగారు. అంతలోనే అందరు చూస్తుండగానే లక్ష్మారెడ్డి కళ్లలో కారంకొట్టిన బాపురెడ్డి కత్తితో దాడిచేశాడు. ఇంతలోనే కొందరు యువకులు తేరుకొని బాపురెడ్డిని అడ్డుకున్నారు. అప్పటికే లక్ష్మారెడ్డి తలపై రెండుచోట్ల గాయాలయ్యాయి. యువకులు ధైర్యం చేసి అడ్డుకోకపోతే లక్ష్మారెడ్డి ప్రాణాలు దక్కేవి కావని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే తహసీల్దార్ రాజలింగు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాపురెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మారెడ్డికి నెన్నెల పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెన్నెల ఎస్సై చందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తహసీల్దార్ రిజిస్ట్రేషన్లు.. అంత ఈజీ కాదట!
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించే ప్రతిపాదనపై భిన్నాభి ప్రాయం వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వ పెద్దలుగానీ, ఇటు ఉన్నతాధికారులుగానీ పైకి ఏమీ మాట్లాడకపోయినా ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై తీవ్రమైన తర్జనభర్జన జరుగుతోంది. కొత్త విధానం అమలు అంత సులువుకాదని, ప్రస్తుత విధానం కొనసాగింపే మేలన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈనెల 8న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంతర్గతంగా ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవల అమలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఆ నివేదికలో పేర్కొన్న గణాంకాలు, సూచనలు ప్రభుత్వ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. ప్రస్తుత విధానాన్ని కొనసాగించడమే మంచిదని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది.నివేదికలోని ముఖ్యాంశాలివీ.. రోజుకు ఒకటి రెండు డాక్యుమెంట్లే! గతేడాది రాష్ట్రంలోని 567 గ్రామీణ మండలాల్లో వ్యవసాయ భూముల కేటగిరీలో 4,54,607 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అందులో 373 మండలాల్లో సగటున రోజుకు మూడు అంతకన్నా తక్కువ సంఖ్యలో (260 మండలాల్లో రోజుకు రెండు.. ఇందులో 128 మండలాల్లో రోజుకో డాక్యుమెంట్ మాత్రమే) డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. మిగతా 194 మండలాలకుగాను 65 చోట్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అంటే సబ్రిజిస్ట్రార్లు లేని 129 మండలాల్లో మాత్రమే రోజుకు మూడు కన్నా ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని మండల కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పన అనవసరపు భారంగా మారుతుంది. ‘శిక్షణ’తో తలనొప్పి ప్రస్తుతం డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల చట్టం–1908, స్టాంపుల చట్టం–1899 ప్రకారం రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్టర్ చేయాలంటే.. ఎమ్మార్వోలకు ఈ చట్టాలు, నియమ నిబంధనలు, స్టాండింగ్ ఆర్డర్ల గురించి శిక్షణ ఇవ్వాలి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుతం అమలు చేస్తున్న ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థపై కూడా 443 మంది ఎమ్మార్వోలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లున్న మండలాల్లో పనిచేస్తున్న ఎమ్మార్వోలకు వీటి గురించి అవగాహన ఉండదు. వారు తర్వాత సబ్రిజిస్ట్రార్లు లేని మండలాలకు బదిలీ అయితే శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. బోలెడు సిబ్బంది అవసరం ప్రతి సబ్రిజిస్ట్రార్కు ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సబార్డినేట్లు, క్లర్కులు కావాలి. మార్కెట్ విలువ సర్టిఫికెట్ల జారీ, చెక్స్లిప్ల తయారీ, డాక్యుమెంట్ల స్కానింగ్, చలానాలు, ఈసీల తయారీ, బయోమెట్రిక్ వివరాల సేకరణ, వెబ్ల్యాండ్ను పోల్చడం, పాస్ పుస్తకాల పరిశీలన, రికార్డుల మెయింటెనెన్స్, స్టాంపుల అమ్మకాల వంటి బాధ్యతలు ఉంటాయి. ఈ మేరకు పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ‘నెట్వర్క్’ ఎలా..? రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థ ఆధారంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఆ మేరకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ నెట్వర్క్ అనుసంధానం అవసరం. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు నెట్వర్క్ను నిర్వహించడమే గగనంగా ఉంది మారుమూల ప్రాంతాల్లోని 584 ఎమ్మార్వో కార్యాలయాలకు నెట్వర్క్ అందించడం చాలా కష్టం. సబ్రిజిస్ట్రార్ల పరిధితో తిప్పలు ప్రస్తుతం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు మండలాల ప్రాతిపదికన లేవు. కొన్ని మండలాల్లో సగం గ్రామాలు ఓ సబ్రిజిస్ట్రార్, మరిన్ని గ్రామాలు మరో సబ్రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల వారీగా విధానం అమలుతో.. పలు సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిని మార్చాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఇబ్బందులు ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం సబ్రిజిస్ట్రార్లు జిల్లా రిజిస్ట్రార్లకు, వారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్కు బాధ్యులుగా ఉంటారు. ఎమ్మార్వోలు నేరుగా కలెక్టర్లకు బాధ్యులుగా ఉంటారు. ఇప్పుడు సబ్రిజిస్ట్రార్లతోపాటు ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే.. వారు ఎవరికి బాధ్యులుగా ఉండాలన్న సందేహం తలెత్తుతోంది. దీనితో ఇరు శాఖల సమన్వయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. ఎమ్మార్వోలు అందుబాటులో లేకుంటే..? ఎమ్మార్వోల వ్యవస్థ అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. వారు వారంలో మూడు రోజుల పాటు తమ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలనలతోపాటు వ్యవసాయం, సాగునీరు, ప్రోటోకాల్ లాంటి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ‘క్రాస్ చెకింగ్’కు ఇబ్బందే ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలను సబ్రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా ఉన్న కమిటీ నిర్ధారిస్తుంది. అందులో ఎమ్మార్వో సభ్యుడిగా ఉంటారు. ఇప్పుడు ఈ రెండూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తుంది. ఇక నిషేధిత భూముల జాబితాలను ఎమ్మార్వోలే సబ్రిజిస్ట్రార్లకు ఇస్తారు. సబ్ రిజిస్ట్రార్లు వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ల సమయంలో క్రాస్ చెకింగ్ చేస్తారు. కొత్త విధానంతో రెండు పనులూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తే క్రాస్ చెకింగ్కు అవకాశం లేకుండా పోతుంది. ఏటా తప్పని ఖర్చు రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలంటే ఏర్పాట్ల కోసం ఒక్కో మండలంలో రూ.10 లక్షల వరకు అవసరం. ఈ లెక్కన రూ.44.3 కోట్లు ఖర్చవుతాయి. తర్వాత నిర్వహణ కోసం కూడా ఏటా రూ.5 కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుంది. ఇది అనవసరపు భారంగా పరిణమిస్తుంది. ఈ యోచన సమంజసం కాదు! కొత్త పాస్ పుస్తకాలు రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో అందించాలంటే.. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలను ఎలక్ట్రానిక్ అనుసంధానం చేస్తే సరిపోతుంది. ప్రభుత్వం అప్పటికీ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ల చట్టానికి అనుగుణంగా ప్రతి మండలానికి, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలి. -
షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు
విజయవాడ : జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఆర్టీవో పురేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 26వ తేదీ నుంచి జిల్లాలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వాహనాలు కొనుగోలు చేసే వారు షోరూంలలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించుకోవాలని సూచించారు. అన్ని కాగితాలు సక్రమంగా ఇస్తే ఒక్క రోజులో రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 974 వాహనాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా 200 దరఖాస్తులు తిరస్కరించామని పేర్కొన్నారు. తిరస్కరించిన దరఖాస్తుదారులు ఆధార్ నంబర్లు ఇవ్వలేదన్నారు. ఆధార్ నంబరు, హెల్మెట్ కొనుగోలు చేసిన బిల్లులు రిజిస్ట్రేషన్ దరఖాస్తులో అప్లోడ్ చేయాలని సూచించారు. ఇంటివద్దకే ఆర్సీ బుక్ను పోస్టులో పంపుతామని వివరించారు.